
ED Raids: హైదరాబాద్ నగరంలో రెండవ రోజూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు కొనసాగుతున్నాయి. దేశంలో ఆర్థిక నేరాలను అరికట్టే ఉద్దేశంతో ఈడీ చేపట్టిన ఈ దాడుల్లో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా నివాసంలో పెద్దఎత్తున నగదు స్వాధీనం కావడం కలకలం రేపుతోంది. ఈడీ ప్రాథమిక విచారణలో నరేంద్ర సురానా పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి, బ్యాంకుల నుంచి పొందిన రుణాలను వీటి ద్వారా అక్రమ లావాదేవీలకు ఉపయోగించినట్లు గుర్తించారు. ఈ షెల్ కంపెనీలకు నిధులు బదలాయింపుతో పాటు, భారీ మొత్తంలో రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్టు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై ఈడీ మరింత లోతుగా విచారణ జరుపుతోంది.
ఈ సోదాల్లో మరో కీలక సంఘటన సాయి సూర్య డెవలపర్స్కు చెందిన సతీష్ ఇంట్లో భారీగా నగదు స్వాధీనం కావడం. అలాగే సాయి సూర్య సంస్థల కార్యాలయాల్లోనూ కోట్లల్లో నగదు పట్టుబడింది. గతంలోనే సైబరాబాద్ పోలీసులు సతీష్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వట్టి నాగులపల్లి ప్రాంతంలో “వెంచర్” పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును దృష్టిలో ఉంచుకుని ఈడీ అధికారులు సాయి సూర్య డెవలపర్స్పై విచారణ చేపట్టారు. ఇప్పటికే సంస్థకు చెందిన పలు బ్యాంకు లావాదేవీలు, ప్రాపర్టీల వివరాలను సేకరిస్తున్నారు. మొత్తం మీద ఈడీ దాడులతో నగర వ్యాప్తంగా ఆర్థిక నేరాలపై ఉక్కుపాదం వేసే దిశగా చర్యలు సాగుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈడీ సోదాల్లో నగదు, షెల్ కంపెనీల వ్యవహారాలు వెలుగులోకి రావడం ఇప్పటికే ఉన్న పోలీసు కేసులతో ముడిపడడం వల్ల ఈ దర్యాప్తు మరింత ఉత్కంఠకు గురిచేస్తోంది. ముందు ముందు రోజుల్లో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.