MS Dhoni, Deepika Padukone-BluSmart: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు రిస్క్తో కూడిన వ్యవహారమని చాలా మంది అంటుంటారు. అయితే, జాగ్రత్తగా కంపెనీ గురించి అధ్యయనం చేసి బ్యాలెన్స్ షీట్స్, పీఈ లెవెల్స్ చెక్ చేసి స్టాక్స్ ఎంచుకోవాలని చెబుతుంటారు. అయితే, చిన్నా చితకా రిటైల్ ఇన్వెస్టర్లకు పెద్దగా అవగాహనా లేకపోయినా కోట్లలో పెట్టుబడులు పెట్టే బడా పెట్టుబడిదార్లకు మాత్రం ఒక టీం దీని మీద అధ్యయనం చేసి మరీ పెట్టుబడులు పెట్టిస్తుంది. అయితే, వాళ్లు కూడా కొన్ని సందర్భాల్లో బురిడీ కొట్టేస్తుంటారు. తాజాగా ఇలాంటి సందర్భమే వచ్చింది. అదీ.. ఎందరికో అభిమానపాత్రుడైన క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీకి.. క్రికెటర్ ధోనీ ఒక్కడే కాదు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కూడా ఈ బాధిత జాబితాలో ఉంది. అసలు ఏంటి ఈ షేర్ మార్కెట్ వ్యవహారం అనేది చూద్దాం.
దేశంలో లీడింగ్ క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్స్ అయిన ఉబర్, ఓలా సంస్థలకు సవాలుగా 2018 లో బెంగళూరు కేంద్రంగా ఏర్పాటైంది బ్లూస్మార్ట్ అనే కంపెనీ. ఈ సంస్థ కో ఫౌండర్ జెన్సోల్ ఇంజనీరింగ్ వ్యవస్థాపకుడు అన్మోల్ జగ్గీ. ఈ సంస్థ పెట్టుబడిదారుల నుండి రూ.4,100 కోట్లకు పైగా సేకరించింది. అయితే ఇప్పుడు అనిశ్చిత భవిష్యత్తు వైపు చూస్తోంది. ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టిన ప్రముఖ పెట్టుబడిదారుల జాబితాలో మహేంద్ర సింగ్ ధోని, దీపికా పదుకొనే, సంజీవ్ బజాజ్ ఇంకా అష్నీర్ గ్రోవర్ తదితరులున్నారు.
బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఈ సంస్థ తొలి పెట్టుబడిదారులలో ఒకరు. 2019లో $3 మిలియన్లు పెట్టుబడి పెట్టడానికి ఏంజెల్ ఫండింగ్ రౌండ్లో దీపిక కుటుంబ కార్యాలయం పాల్గొంది. 2019లో అదే రౌండ్లో, బజాజ్ క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ బజాజ్, JITO ఏంజెల్ నెట్వాక్, రజత్ గుప్తాతో కలిసి $3 మిలియన్ల పెట్టుబడితో స్టార్టప్కు మద్దతు ఇచ్చారు. ఇక, గతేడాది కంపెనీ ప్రీ-సిరీస్ B ఫండింగ్లో $24 మిలియన్లను సేకరించింది. ఇందులో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని కుటుంబ కార్యాలయం పెట్టుబడులు పెట్టింది. అటు, భారత్పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ కూడా పెట్టుబడులు పెట్టిన వారిలో ఉన్నారు.
ఇలా ఉంటే, “బ్లూస్మార్ట్ యాప్లో బుకింగ్లను తాత్కాలికంగా మూసివేయాలని మేము నిర్ణయించుకున్నాము” అని బ్లూస్మార్ట్ కంపెనీ ఏప్రిల్ 17న కస్టమర్లకు పంపిన ఇమెయిల్లో తెలిపింది. అయితే, ఈ మెయిల్.. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రెండు రోజుల ముందు చేసిన ఒక కీలక మైన ప్రకటన తర్వాత వచ్చింది. ఇంతకీ సెబీ ఏమందంటే.. బ్లూస్మార్ట్ స్టార్టప్ ప్రమోటర్లైన జెన్సోల్ ఇంజనీరింగ్ అధిపతులు అన్మోల్, పునీత్ సింగ్ జగ్గీ బ్లూస్మార్ట్ కోసం కార్లు కొనడానికి ఉద్దేశించిన రుణాలను గురుగ్రామ్లోని DLF యొక్క ది కామెలియాస్లోని లగ్జరీ అపార్ట్మెంట్ కోసం, ఇంకా రూ. 26 లక్షల విలువైన హై-ఎండ్ గోల్ఫ్ పరికరాలు కొనుక్కొనేందకు మళ్లించారని కనుగొన్నట్లు చెప్పింది. అంతేకాదు, మధ్యంతర ఉత్తర్వులో, జగ్గీ సోదరులు సంస్థలో డైరెక్టర్ పదవులను నిర్వహించకుండా ఇంకా మార్కెట్లోకి ప్రవేశించకుండా సెబీ నిషేధించింది.
కాగా జెన్సోల్ ఇంజనీరింగ్ సంస్థ ఐఆర్ఈడీఏ(IREDA), పీఎఫ్సీ(PFC) నుంచి మొత్తంగా రూ.977.75 కోట్ల మేర రుణం తీసుకుంది. ఇందులో రూ.663.89 కోట్లను ప్రత్యేకంగా 6,400 విద్యుత్తు వాహనాల కొనుగోలుకు కంపెనీ వెచ్చించాలి. కొన్నవాటిని బ్లూస్మార్ట్కు లీజ్కు ఇవ్వాలి. అయితే, ఇప్పటివరకు 4,704 ఈవీలను రూ.567.74 కోట్లతో కొనుగోలు చేశామని ఫిబ్రవరిలో సెబీకి జెన్సోల్ చెప్పింది. జెన్సోల్కు ఆ వాహనాలు సరఫరా చేసినట్లు కూడా గో-ఆటో ప్రైవేట్ లిమిటెడ్ ధ్రువీకరించింది. ఇందులో జెన్సోల్ కంపెనీ తన వాటా కింద మరో 20% చెల్లించాలి కనుక, రుణాలతో కలిపి ఈవీల కొనుగోలుకు కేటాయించాల్సిన మొత్తం రూ.829.86 కోట్లు అయింది. ఇందులో 4,704 ఈవీ వాహనాలకు వెచ్చించిన రూ.567.74 కోట్లు తీసివేస్తే, మిగిలిన రూ.262.13 కోట్లకు లెక్క తేలలేదు.
దీంతో రూ.262.13 కోట్ల రూపాయల నిధులు ఏమయ్యాయో తెలుసుకునేందుకు జెన్సోల్, గో-ఆటోల బ్యాంకు స్టేట్మెంట్లను సెబీ విశ్లేషించింది. పలు సందర్భాల్లో ఈవీ కొనుగోళ్ల కోసం గో-ఆటోకు బదిలీ చేసిన నిధులు తిరిగి ప్రత్యక్షంగా, పరోక్షంగా జెన్సోల్, అన్మోల్,పునీత్ ఖాతాల్లోకి వచ్చినట్లు సెబీ గుర్తించింది. ఇందులో కొంత మొత్తాన్ని ఇతర అవసరాల కోసం వినియోగించారు. కొంతమొత్తం తమ విలాసవంత అపార్ట్మెంట్ల కొనుగోలుకు, బంధువులకు డబ్బుల బదిలీ, తమ సొంత సంస్థల్లో పెట్టుబడులు, చివరికి క్రెడిట్ కార్డుల చెల్లింపుల కోసమూ కంపెనీ నిధులు వాడుకున్నారని సెబీ నిర్ధారించింది.
అంతే, మార్కెట్ ఓపెన్ కాగానే కేవలం రెండు రోజుల్లో ఆ సంస్థ షేర్లు ఫ్రీ ఫాల్ అయిపోయాయి. లోయర్ సర్యూట్స్ తాకుతూ నేలను చూస్తున్నాయి. నిధుల మళ్లింపు కేసులో కంపెనీ, ప్రమోటర్లు అన్మోల్, పునీత్ సింగ్ జగ్గీలపై సెబీ నిషేధం విధించడంతో జెన్సోల్ ఇంజినీరింగ్ షేర్లలో పతనం ఇంకా కొనసాగుతోంది. వరుసగా రెండోరోజూ ఆ కంపెనీ షేర్లు లోయర్ సర్క్యూట్ను తాకాయి. గురువారం కంపెనీ షేర్లు 5 శాతం క్షీణించి 116.54 వద్ద కనిష్ఠాన్ని తాకాయి. ఆల్టైమ్ గరిష్ఠాల నుంచి కంపెనీ షేర్లు దాదాపు 90 శాతం మేర పతనమయ్యాయి. గతంలో ఈ కంపెనీ షేర్లు గరిష్ఠంగా రూ.1,124.90 వద్ద ట్రేడయ్యాయి. సంస్థపై గత కొన్ని రోజులుగా వస్తున్న అభియోగాల నేపథ్యంలో ఈ ఒక్క క్యాలెండర్ ఇయర్ లోనే 84 శాతం మేర పతనమైంది. ఈ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన క్రికెటర్ ధోనీ, హీరోయిన్ దీపికా పదుకునే తదితరులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.

ఇవీ చదవండి:
సీఎస్కేలోకి డివిలియర్స్ వారసుడ
ఐపీఎల్ నుంచి కమిన్స్ ఔట్
స్టార్ క్రికెటర్లు నాకు అశ్లీల ఫొటోలు పంపారు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి