ABN
, Publish Date – Mar 31 , 2025 | 03:47 AM
రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వం వ్యాపార లావాదేవీలకే ప్రాధాన్యం ఇచ్చిందని, అయితే తాము పేదలకు అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. చంద్రబాబు విజన్ వల్లే పీ4 సాధ్యమైందని, 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.

సినిమాల్లో రెండున్నర గంటల్లోనే సమస్యలన్నీ తీరిపోతాయ్
కానీ నిజ జీవితంలో చంద్రబాబు లాంటి విజనరీ నేత కావాలి
అందుకే ఆయనకు మద్దతిస్తున్నాం
పీ4 ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించేందుకే పీ4 కార్యక్రమాన్ని చేపట్టామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పీ4 అంటే డబ్బులిచ్చేయడం కాదని… మార్గదర్శనం చేయడమని చెప్పారు. పీ4 కోసం సర్వేలు, గ్రామసభల ద్వారా 30 లక్షల కుటుంబాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం కంపెనీలు కనిపిస్తే వాటాలు రాయించుకుందని… కానీ, తాము మాత్రం పేదలకు అభివృద్ధిలో వాటా కల్పించమని అడుగుతున్నామని చెప్పారు. ఆదివారం సాయంత్రం అమరావతిలో పీ4 కార్యక్రమం ప్రారంభం సందర్భంగా పవన్ మాట్లాడారు. చంద్రబాబు సీఎంగా లేకపోతే.. పీ4 బయటకి వచ్చేదే కాదన్నారు. ఆయన మా అందరికీ మార్గదర్శకత్వం చేస్తూ.. కష్టా ల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తున్నారని, అందుకే 2014 నుంచి చంద్రబాబుకి మద్దతిస్తున్నామని తెలిపారు. పీ4ను ప్రభు త్వ కార్యక్రమంగా చేపట్టిన సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు చెప్పారు. ‘సినిమాల్లో రెండున్నర గంటల్లోనే సమస్యలన్నీ తీరిపోతాయి. కానీ నిజజీవితంలో అలా కాదు. చంద్రబాబు లాంటి విజన్ ఉన్న నేత కావాలి. 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించేందుకు పీ4 పథకం ఉపయోగపడుతుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో వికసిత్ భారత్ కోసం ముందుకు సాగుతుండగా.. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ స్వర్ణాంధ్రప్రదేశ్గా రూపుదిద్దుకుంటోంది’ అన్నారు.
Updated Date – Mar 31 , 2025 | 03:47 AM