నేడు భారత రాయబారితో ఆతిథ్య సమావేశం
రేపు, ఎల్లుండి టోక్యోలో పలు కంపెనీలతో భేటీ
23న ఉదయం తిరిగి రాష్ట్రానికి రాక
హైదరాబాద్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా పలు శాఖల అధికారులతో కలిసి ఆయన జపాన్ పర్యటనకు వెళ్లారు. బుధవారం నుంచి 22 వరకు ఈ బృందం జపాన్లో పర్యటించి, 23న ఉదయం రాష్ట్రానికి రానుంది. టోక్యో, మౌంట్ ఫుజీ, ఒసాకా, హిరోషిమాలో ముఖ్యమంత్రి బృందం పర్యటిస్తుంది. ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక వేత్తలు, పలువురు ప్రతినిధులతో సమావేశమవుతుంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం, పారిశ్రామిక సాంకేతిక సహకారంపై జపాన్ కంపెనీలతో సీఎం బృందం చర్చలు జరుపుతుంది. పర్యటనలో భాగంగా ఒసాకా వరల్డ్ ఎక్స్పో-2025లో తెలంగాణ పెవెలియన్ను ప్రారంభిస్తారు.
సీఎం షెడ్యూల్ ఇలా..
జపాన్ వెళ్లేందుకు మంగళవారం సాయంత్రమే సీఎం బెంగళూరుకు వెళ్లారు. బుధవారం ఉదయానికి ఆయన జపాన్లోని నారిటా ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అనంతరం భారత రాయబారితో అతిథ్య భేటీలో పాల్గొంటారు.
ఏప్రిల్ 17: టోక్యోలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సోనీ గ్రూప్, జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ, జెట్రో, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్, వివిధ సంస్థలతో నిర్వహించే సమావేశాల్లో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం తోషిబా ఫ్యాక్టరీని సందర్శిస్తారు.
ఏప్రిల్ 18: టోక్యోలో ఉన్న గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. అనంతరం టోక్యో గవర్నర్తో మర్యాదపూర్వక సమావేశమవుతారు. ఆ తర్వాత ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో పరిశ్రమల ప్రతినిధులతో భేటీ అవుతారు. అనంతరం టయోటా, తోషిబా, ఐసిన్, ఎన్టీటీ తదితర కంపెనీల సీఈవోలతో వేర్వేరుగా సమావేశమవుతారు. జపాన్ ఓవర్సీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వె్స్టమెంట్ కార్పొరేషన్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ అర్బన్ డెవల్పమెంట్ ప్రతినిధులతో సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సుమిదా రివర్ ఫ్రంట్ను సందర్శిస్తారు.
ఏప్రిల్ 19: టోక్యో నుంచి ఒసాకా వెళ్తారు. అక్కడ మౌంట్ ఫుజీ ప్రాంతాన్ని, అరకురయామా పార్క్ను సందర్శిస్తారు.
ఏప్రిల్ 20: ఒసాకాలోని కిటాక్యూషు సిటీకి వెళ్తారు. అక్కడి మేయర్తో సమావేశమవుతారు. ఎకో టౌన్ ప్రాజెక్టుకు సంబంధించిన సమావేశంలో పాల్గొంటారు. మురసాకకి రివర్ మ్యూజియం, ఎన్విరాన్మెంట్ మ్యూజియం అండ్ ఎకో టౌన్ సెంటర్లను సందర్శిస్తారు.
ఏప్రిల్ 21: ఒసాకాలోని యుమెషిమాలో వరల్డ్ ఎక్స్ పో-2025లో తెలంగాణ పెవిలియన్ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఒసాకా రివర్ ఫ్రంట్ను సందర్శిస్తారు.
ఏప్రిల్ 22: ఒసాకా నుంచి హిరోషిమా చేరుకుంటారు. అక్కడ హిరోషిమా పీస్ మెమోరియల్ను సందర్శించి, గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. ఆ తర్వాత హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ ఛైర్మన్లతో సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం హిరోషిమా జపాన్- ఇండియా చాప్టర్తో కలిసి బిజినెస్ లంచ్ చేస్తారు. అక్కడి నుంచి హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మజ్దా మోటార్స్ ఫ్యాక్టరీలను సందర్శిస్తారు. ఆ తర్వాత ఒసాకాలోని కాన్సాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి తెలంగాణకు బయలుదేరి.. 23న ఉదయానికి హైదరాబాద్ చేరుకుంటారు.
For AndhraPradesh News And Telugu News
Updated Date – Apr 16 , 2025 | 05:53 AM