బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఉత్తర- ఈశాన్య దిశగా తిరిగి వచ్చి, 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందంటున్నారు అధికారులు. దీని ప్రభావంతో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు అధికారులు. రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నిన్న నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఒకసారి చూస్తే.. కర్నూలు జిల్లా ఉలిందకొండలో అత్యధికంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా దరిమడుగలో 40.3 డిగ్రీలు, చిత్తూరు జిల్లా తవణంపల్లెలో 40.1 డిగ్రీలు, కడప జిల్లా అమ్మలమడుగులో 39.9 డిగ్రీలు, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎర్రంపేటలో 38.7 డిగ్రీలు, అమరావతిలో 38.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతల నమోదయ్యాయి.
తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులపై ఆ శాఖ అధికారి ధర్మరాజు కీలక విషయాలు వెల్లడించారు. వాతావరణంలోని మార్పులతో పగలు ఎండలు, రాత్రి వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. ఉత్తర భారత నుంచి దక్షిణ భారతం వైపు పొడి వాతావరణంతో కూడిన ఈదురు గాలులు వీస్తున్నాయని తెలిపారు. ఇక.. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని ప్రకటించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..