నిడదవోలు, ఏప్రిల్ 28: నిడదవోలు నియోజకవర్గ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడం కోసం మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సోమవారం (ఏప్రిల్ 28) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 3వ తేదీన ఎస్ వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో ఈ మెగా జాబ్ మేళ జరగనుందని తెలిపారు. జాబ్ మేళాలో భాగంగా 1302 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం ఉందన్నారు. తద్వారా రూ.12 000 నుంచి రూ.40,000 వరకు జీతం పొందవచ్చన్నారు.
జాబ్ మేళాకు ఇసూజూ, ఎల్ అండ్ టీ కన్ స్ట్రక్షన్, జీఎంఆర్ కార్గో, పానాసోనిక్,హెచ్ డీబీ ఫినాన్షియల్ సర్వీసెస్, అపోలో ఫార్మసీ, ఐసోన్ ఎక్స్ పీరియన్సెస్, స్మార్ట్ బ్రెయిన్స్, సాండ్ స్పేస్ టెక్నాలజీస్, డీలేట్ కర్ కార్పొరేట్, సదర్ ల్యాండ్, సినర్జీన్, ఈఎస్ఏఎఫ్, స్పందన, ముత్తూట్ ఫైనాన్స్, పైసా బజార్, రీసొల్యూట్, ఇండస్, ఎంసీవీ, ఇండో ఎంఐఎం, పిల్కింగ్టన్, ఇన్ ఫిలూమ్, హెచ్ డీఎఫ్ సీ, బీఎస్ సీపీఎల్, జీఎల్ఆర్, డెక్కన్ ఫైన్ కెమికల్స్ తదితర 45 కంపెనీల ప్రతినిధులు రానున్నారని తెలిపారు.
పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ పాసై మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న యువత ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవాలన్నారు. నియోజకవర్గంలోని 35 ఏళ్లలోపు ఆసక్తిగల నిరుద్యోగ యువతీయువకులు తమ బయోడెటా, విద్యార్హత, సర్టిఫికెట్లతో మే3వ తేదీన ఉదయం 9 గంటల నుంచి నిర్వహించే జాబ్ మేళాకు హాజరుకావాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యగ వార్తల కోసం క్లిక్ చేయండి.