AP Hostels: హాస్టల్‌లో అన్నం పెట్టలేం! పిల్లల్ని ఇళ్లకు తీసుకెళ్లాలంటూ ఫోన్లు

Written by RAJU

Published on:

మీ పిల్లల్ని ఇళ్లకు తీసుకెళ్లండి

తల్లిదండ్రులకు ‘మోడల్‌’ హాస్టల్‌ వార్డెన్‌ ఫోన్‌

3 నెలలుగా బియ్యం ఇవ్వని ప్రభుత్వం

కర్నూలు జిల్లా అంతటా ఇదే పరిస్థితి

కోసిగి, ఆగస్టు 21: ‘ప్రభుత్వ హాస్టళ్లలో బియ్యం లేవు. ఇక విద్యార్థులకు అన్నం పెట్టలేం. మీ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లండి’ అంటూ మోడల్‌ స్కూల్‌ హాస్టల్‌ వార్డెన్‌ విద్యార్థినుల తల్లిదండ్రులకు ఫోన్‌లో సమాచారమిచ్చారు. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో జరిగిదీ ఘటన. మోడల్‌ స్కూళ్లకు అనుబందంగా ఉన్న బాలికల హాస్టల్‌కు ఈ ఏడాది విద్యాసంవత్సరం ఆరంభమైననాటి నుంచి బియ్యం సరఫరా నిలిచిపోయింది. జిల్లాలో 19 మోడల్‌ స్కూల్‌ హాస్టళ్లు ఉన్నాయి. ఒక్కొక్క హాస్టల్‌లో వంద మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. కోసిగి మోడల్‌ స్కూల్‌లో సుమారు 80 మంది విద్యార్థినులు హాస్టల్‌లో ఉంటున్నారు. ప్రభుత్వం నుంచి బియ్యం రాకపోవడంతో కేజీబీవీ పాఠశాలల్లో మూడు నెలలకు గానూ 10 క్వింటాళ్ల బియ్యాన్ని అరువుగా తెచ్చుకున్నారు. ఇక ఎవరూ బదులుగా కూడా బియ్యం ఇచ్చేది లేదని చెప్పడంతో సోమవారం కోసిగి మోడల్‌ స్కూల్‌ వార్డెన్‌ భారతీబాయి సోమవారం విద్యార్థినుల తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి ‘హాస్టల్‌లో బియ్యం లేవు. మీ పిల్లలను తీసుకెళ్లండి. రోజూ డేస్కాలర్‌గా పంపండి’ అని సూచించారు. దీంతో తల్లిదండ్రులు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పెద్దకడుబూరు మండలంలోని మోడల్‌ స్కూల్‌ హాస్టల్‌లో వంద మంది విద్యార్థులు ఉండగా అక్కడా 10 క్వింటాళ్ల బియ్యం వేరే పాఠశాల నుంచి అరువుగా తెచ్చుకుని వంట చేసిపెట్టారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 19 మోడల్‌ స్కూల్‌ హాస్టళ్లలో బియ్యం లేకపోవడంతో వార్డెన్లు ఆందోళన చెందుతున్నారు. బియ్యం రాకపోతే జిల్లా అంతటా హాస్టల్స్‌ మూసివేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

జూన్‌ నుంచి బియ్యం రాలేదు

జూన్‌లో పాఠశాలల ప్రారంభం నుంచి హాస్టల్‌కు ప్రభుత్వం బియ్యం పంపిణీ చేయలేదు. వేరే పాఠశాలల నుంచి బియ్యాన్ని అరువుగా తెచ్చుకున్నాం. ఇప్పుడు వారు కూడా ఇవ్వకపోవడంతో విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు ఫోన్‌ చేశాం.

-భారతీబాయి, మోడల్‌ స్కూల్‌ హాస్టల్‌ వార్డెన్‌, కోసిగి

బియ్యం సరఫరాకు 2 రోజుల్లో అనుమతి

కర్నూలు జిల్లాల్లోని 19 మోడల్‌ స్కూళ్ల హాస్టల్స్‌కు విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి బియ్యం సరఫరా నిలిచిపోయిన మాట వాస్తవమే. విషయాన్ని రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. బియ్యం సర్దుబాటు చేసుకుని హాస్టల్‌ వార్డెన్లు, ప్రిన్సిపాళ్లు వసతిగృహాలను కొనసాగించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలను ఇంటికి పంపించకూడదు. హాస్టళ్లకు బియ్యం సరఫరాపై రెండు రోజుల్లో అనుమతులు వస్తాయి.

-వేణుగోపాల్‌, సర్వశిక్ష ఏపీసీ, కర్నూలు

Subscribe for notification