కూలీపనుల కోసం తమిళనాడు వెళ్తూ మార్గమధ్యలో టీ తాగేందుకు ట్రైన్ దిగి తప్పిపోయిన సుక్కు ఎట్టకేలకు తమ కుటుంబసభ్యుల వద్దకు చేరుకున్నాడు. 22 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యులకు దూరమై అప్పటి నుంచి బ్రతుకు తెరువు కోసం కూలీ కూడా లేకుండా వెట్టిచాకరీ చేస్తూ తమిళనాడులో జీవనం సాగించాడు. ఇటీవల తమిళనాడు కార్మికశాఖ అధికారుల దాడులతో సుక్కు వెట్టిచాకిరి వ్యవస్థ నుంచి బయటపడ్డాడు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అప్పారావు తన కుటుంబ సభ్యుల వద్దకు చేరుకున్నాడు.. దీంతో ఆయనతో కుటుంబ సభ్యులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బ్రతుకుతెరువు కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్లిన సుక్కు 22 ఏళ్లుగా కూలీ, నాలీ లేకుండా వెట్టి చాకిరీ చేస్తూ గడిపాడు. అయితే గత పది రోజుల క్రితం తమిళనాడులో కార్మిక శాఖ అధికారులు పలు వ్యాపార రంగ సంస్థల పై దాడులు నిర్వహించారు. అలా చేసిన దాడుల్లో అప్పారావు ఇరవై ఏళ్లుగా కూలీ లేకుండా వెట్టి చాకిరీ చేస్తున్నాడని గుర్తించారు. అనంతరం అతన్ని ఓ ప్రభుత్వ వసతిగృహానికి చేర్చి అతన్ని పేరు తెలుసుకొని కుటుంబసభ్యుల కోసం ఆరా తీశారు. అలా సేకరించిన సమాచారంలో వెట్టిచాకిరి చేస్తున్న వ్యక్తి అప్పారావు అని, అతనిది పార్వతీపురం మన్యం జిల్లా అని గుర్తించారు.
అనంతరం పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కు అప్పారావు ఫోటో పంపించి అతని ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన జాతాపు ఆదివాసి తెగకు చెందిన సుక్కు అని గుర్తించారు.. సుక్కు 20 ఏళ్ల క్రితం ఉపాధి నిమిత్తం తన గ్రామానికి చెందిన పలువురితో కలిసి రైలులో పాండిచ్చేరి బయలుదేరాడు. అలా రైలు తమిళనాడులోకి ప్రవేశించిన తర్వాత మార్గమధ్యలో ఒక స్టేషన్ లో ఆగింది. వెంటనే అప్పారావు టీ తాగేందుకు ట్రైన్ నుండి క్రిందకు దిగాడు. వెంటనే టీ స్టాల్ వద్దకు వెళ్లి టీ త్రాగి తిరిగి స్టేషన్ కు వచ్చి చూసేసరికి ట్రైన్ కనిపించలేదు. అధికారులను అడగ్గా ట్రైన్ వెళ్లిపోయిందని తెలియజేశారు. అయితే సుక్కు వద్ద డబ్బులు లేకపోవడంతో ఎటు వెళ్లాలో, ఏమి చేయాలో తెలియక అక్కడే ఉండిపోయాడు. రెండు రోజులు అటూ ఇటూ తిరిగి ఏం చేయాలో పాలుపోక తినటానికి తిండి కోసం తమిళనాడులోని ఓ వ్యక్తి వద్ద గొర్రెల కాపలాదారుడిగా పనిలో జాయిన్ అయ్యాడు. అలా జాయిన్ అయిన సుక్కుకు కూలీ డబ్బులు ఇవ్వకుండా బలవంతంగా తన వద్దనే ఉంచుకున్నాడు యజమాని. అప్పారావు బయటికి వెళితే తిరిగి రాడేమోనని ఉద్దేశ్యంతో ఆ ప్రదేశం నుంచి బయటకు కూడా వెళ్లనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అలా దాదాపు 20 ఏళ్లు వెట్టిచాకిరీ చేస్తూ అక్కడే ఉండిపోయాడు సుక్కు..

Apparao
అయితే ఇటీవల శివగంగ జిల్లా కదంబకళం ప్రాంతంలో తమిళనాడు కార్మిక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో సుక్కు వారి కంటపడ్డాడు. అప్పుడు అధికారులు సుక్కు తో మాట్లాడి వివరాలు సేకరించారు. తనది పార్వతీపురం మండలం జమ్మవలస అని అధికారులకు తెలియజేశాడు సుక్కు. వెంటనే తమిళనాడు కార్మిక శాఖ అధికారులు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కు సుక్కు ఫోటో పంపించి వివరాలు తెలియజేశారు. వెంటనే కలెక్టర్ శ్యాం ప్రసాద్ పోలీసులకు ఫోటో అందజేసి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించాలని ఆదేశించాడు. దీంతో వెంటనే రంగంలో దిగిన పోలీసులు జమ్మవలస గ్రామానికి వెళ్లి సుక్కు ఫోటో చూయించి ఆరా తీయగా అలాంటి వారెవరు తమకు తెలియదని, ఎప్పుడూ చూడలేదని గ్రామస్తులు తెలియజేశారు. దీంతో సుక్కు ఆచూకీ కోసం పార్వతీపురం మన్యం జిల్లాలోనే మరికొన్ని గ్రామాల్లో వెదకడం ప్రారంభించారు. సుక్కు ఆచూకి తెలిసిన వారు తమకు తెలియజేయాలని పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు అధికారులు.
అయితే అప్పారావు అసలు పేరు కొండగొఱ్ఱె సుక్కు. ట్రైన్ దిగి తప్పిపోయిన తరువాత సుక్కు అనే పేరు మార్చుకుని అప్పారావు అని పెట్టుకున్నాడు. దీంతో అప్పారావు అని అంటే ఎవరు గుర్తు పట్టలేకపోయారు. అంతేకాకుండా 22 ఏళ్లు కావడంతో అతని పోలికలు కూడా మారిపోయాయి. దీంతో అతని ఆచూకి దొరకడం సవాలుగా మారింది. చివరికి జిల్లాలో పలువురు యువకులు కూడా అతని ఫోటో పట్టుకొని వెదకడం ప్రారంభించారు. ఇందులో భాగంగా అనంతరావు టంకాల అనే యువకుడు కొండగొర్రే సుక్కు కుమార్తె పార్వతీపురం మండలం ములక్కాయవలసలో ఉందని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అలా అప్పారావు ఆచూకీ తెలుసుకొని ఎట్టకేలకు కుమార్తె కు అప్పారావును అందజేశారు. దీంతో అప్పారావు కుటుంబంలో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అంతేకాకుండా 22 ఏళ్లు కూలీ లేకుండా పని చేయించుకున్న యజమాని వద్ద నుండి కూలీ డబ్బులు అందజేయడంతో అప్పారావు జీవనోపాధికి మేకల యూనిట్ ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ హామీ ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..