
రాళ్లపూడి అంకమ్మ అనే వృద్ధురాలు రెల్లిగూడెంలోని తన ఇంట్లో నివాసం ఉంటుంది. అంకమ్మ భర్తతో పాటు ఆమెకు ఉన్న ఒక్కగానొక్క కుమార్తె కూడా గత కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. అలా తన ఇద్దరు కుటుంబసభ్యులు చనిపోవడంతో చేసేదిలేక ఒంటరిగానే ఇంట్లో నివాసం ఉంటుంది. ఈ క్రమంలోనే మార్చి 16, 2025వ తేదీన రాళ్లపూడి అంకమ్మ తన ఇంట్లోనే అకస్మాత్తుగా మృతి చెందింది. దీంతో స్థానికులు గమనించి విశాఖలో నివసిస్తున్న అంకమ్మ మనుమడు పైలా దుర్గాకి విషయం తెలియజేశారు. అంకమ్మ మరణవార్త విన్న మనుమడు దుర్గా హుటాహుటిన రెల్లిగూడెంకు చేరుకున్నాడు. అక్కడ అంకమ్మ మృతదేహం చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. అయితే తన అమ్మమ్మని దగ్గర నుండి చూసిన మనుమడుకి.. ఆమె ముక్కు నుండి రక్తస్రావం అయినట్లు ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మనుమడు దుర్గా ఫిర్యాదు మేరకు ముందుగా అనుమానాస్పద మృతి క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. అలా దర్యాప్తు జరిపిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు తెలిశాయి. గ్రామంలో ఒంటరిగా ఉంటున్న అంకమ్మ తనకు వస్తున్న పెన్షన్తో పాటు తన వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బును గ్రామస్తులకు వడ్డీకి ఇచ్చి జీవనం సాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే గ్రామానికి చెందిన ధనాల రాములమ్మ అనే మహిళ తన అవసరాల నిమిత్తం అంకమ్మ వద్దకు వచ్చి తనకు మూడు వేల రూపాయలు డబ్బులు వడ్డీకి కావాలని అడిగింది. అయితే మొదటి నుండి రాములమ్మ ప్రవర్తన నచ్చని అంకమ్మ తన వద్ద డబ్బు లేదని చెప్పి అప్పు ఇవ్వటానికి నిరాకరించింది. దీంతో కేవలం మూడు రూపాయలు డబ్బులు అడిగితే అప్పు ఇవ్వలేదని అంకమ్మ పై రాములమ్మ పగ పెంచుకుంది. అవమానభారంతో రగిలిపోయిన రాములమ్మ ఎలాగైనా అంకమ్మను హత్య చేయాలని నిర్ణయించుకుంది.
దీంతో తనతో అక్రమ సంబంధం నెరుపుతున్న ధానాల రాము, ధానాల దుర్గరావు, బొడ్డు సాయంతో అంకమ్మ హత్యకు ప్లాన్ చేసింది. ముందుగా మూడు రోజుల పాటు ఇంటి పరిసరాలలో రెక్కీ నిర్వహించి రాత్రి సమయంలో ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారం మిగతా ముగ్గురితో కలిసి అంకమ్మ ఇంట్లోకి ప్రవేశించింది రాములమ్మ. తరువాత నిద్రిస్తున్న అంకమ్మపై దాడి చేసి కాళ్లు, చేతులు పట్టుకొని గుండెలపై గుద్ది, దిండుతో ఊపిరాడకుండా నొక్కి హత్య చేశారు. అక్కడ అంకమ్మ మృతిని నిర్ధారించుకుని అక్కడ నుండి వెళ్లిపోయారు నలుగురు నిందితులు. అలా పోలీసుల దర్యాప్తులో ధనాల రాములమ్మతో పాటు మిగతా ముగ్గురు అంకమ్మ హత్యకు సంబంధించిన విషయాన్ని ఒప్పుకోవడంతో పోలీసులు నిందితులను రిమాండ్కు పంపారు. మూడు వేల రూపాయల కోసం జరిగిన వృద్ధురాలి హత్య అందరినీ కలిచివేస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..