- చంద్రాయణగుట్ట ప్రాంతంలో చిన్నారి కిడ్నాప్..
- గంటలో చేధించిన పోలీసులు
- సీసీకెమెరా ఫుటేజ్ ద్వారా విచారణ
- అదుపులో కిడ్నాప్ చేసిన ముఠా.

Chandrayangutta: పాతబస్తీ చంద్రాయణగుట్ట ప్రాంతంలో ఓ చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. అయితే, ఈ సంఘటనలో పోలీసులు వేగంగా స్పందించడంతో గంటలోనే బాలుడిని రక్షించి, కిడ్నాపర్లను పట్టుకోవడం విశేషం. ఇందుకు సంబంధించిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఒక బాలుడిని అతని బాబాయి సాదిక్ దగ్గరకు తీసుకెళ్లారు. సాదిక్ బాలుడిని ఓ వైన్ షాప్ కు తీసుకెళ్లాడు. అక్కడ మద్యం సేవించిన సాదిక్ స్పృహ కోల్పోయి రోడ్డు పక్కనే పడిపోయాడు. ఈ సమయంలో బాలుడు ఒంటరిగా ఉన్నదాన్ని గమనించిన ఒక కిడ్నాప్ ముఠా పిల్లాడిని ఎత్తుకెళ్లింది.
బాలుడు కనిపించకపోవడంతో వెంటనే ఆ బాలుడి బాబాయి, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి సీసీకెమెరా ఫుటేజ్ ద్వారా విచారణ ప్రారంభించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు త్వరిత చర్యలు తీసుకుని గంటలోనే బాలుడిని కిడ్నాప్ చేసిన ముఠాను పట్టుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు చూపిన స్పందనకు ప్రజల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారుల భద్రతపై పెద్దల బాధ్యత ఎంత ముఖ్యమో ఈ సంఘటన మరొకసారి గుర్తు చేసింది.