అమరావతి, ఏప్రిల్ 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ విద్యలో పలు సంస్కరణలు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఐదు సబ్జెక్టులకు బదులు ఆరు సబ్జెక్టులను ఎంచుకోవల్సి ఉంటుంది. అయితే విద్యార్థులు ఎంపిక చేసుకున్న ఆరో సబ్జెక్టులో ఉత్తీర్ణత తప్పనిసరి కాదని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో తీసుకువచ్చిన అనేక సంస్కరణలపై సందేహాలు వ్యక్తమవుతుండటంతో బోర్డు ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. ఫస్ట్ ఇయర్లో పార్ట్ 1 కింద ఇంగ్లిస్ సబ్జెక్టు ఉంటుంది. పార్ట్ 2 కింద తెలుగు, సంస్కృతం, అరబిక్ ఇలా భాష సబ్జెక్టులతోపాటు గ్రూపు సబ్జెక్టులు కూడా ఉంటాయి.
పార్ట్ 3లో గ్రూపు సబ్జెక్టులు ఉంటాయి. అభ్యర్థి ఎంపీసీ గ్రూపు ఎంపిక చేసుకుంటే గణితం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం గ్రూపు సబ్జెక్టులు ఉంటాయి. అయితే విద్యార్థి ఎంపీసీ గ్రూపు తీసుకొని గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, ఇంగ్లిష్, తెలుగు చదువుతూ ఆరో సబ్జెక్టుగా జీవశాస్త్రం తీసుకున్నాడనుకుంటే జీవశాస్త్రంలో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సిన అవసరం ఉండదన్నమాట. అంతేకాకుండా ఆరో సబ్జెక్టులో ఫెయిల్ అయినా ఐదు సబ్జెక్టులు పాసైనట్లు మెమో ఇస్తారు. ఒకవేళ ఆరో సబ్జెక్టులోనూ పాసైతే ప్రత్యేకంగా మరో మెమో జారీ చేస్తారు.
కానీ పార్ట్2లో తెలుగు, సంస్కృతం, అరబిక్లాంటి భాష సబ్జెక్టులతోపాటు గ్రూపు ఆప్షనల్ సబ్జెక్టులు కలిపి మొత్తం 24 వరకు ఉంటాయి. వీటిల్లో ఏ సబ్జెక్టునైనా విద్యార్థి ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు ఎంపీసీ విద్యార్థి గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఆంగ్ల భాష సబ్జెక్టుతోపాటు జీవశాస్త్రాన్ని ఎంపిక చేసుకుంటే జీవశాస్త్రంలో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ ఐదు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత తప్పనిసరన్నమాట. వీళ్లు జేఈఈతోపాటు నీట్ పరీక్ష కూడా రాసుకోవచ్చు. ఒకే కోర్సులో ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ చదివేందుకు అర్హత లభిస్తుంది. ఈ మేరకు ఎన్సీఈఆర్టీ సిలబస్ను ప్రవేశ పెట్టడంతోపాటు ప్రశ్నపత్రాల విధానాన్ని మార్పు చేశారు. గతంలోలానే ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులు ఉంటాయి. వీటిల్లో పార్ట్ 2లో ఎంపిక చేసిన సబ్జెక్టును చదువుకోవచ్చు. వీటితోపాటు విద్యార్థి ఆసక్తి మేరకు అదనంగా ఆరో సబ్జెక్టు చదువుకోవడానికి వీలుంటుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.