విశాలాంధ్ర – హైదరాబాద్ : తెలంగాణను వెట్టిచాకిరీ విముక్తి రాష్ట్రంగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించిన కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని, ఆర్థిక సహకారం కూడా అందజేస్తామన్నారు. జాతీయ వెట్టి చాకిరి విముక్తి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ, తెలంగాణ అసంఘటిత కార్మికుల సంఘం, స్వచ్ఛంద సంస్థల సంయుక్త అధ్వర్యంలో రాష్ట్ర సదస్సు బుధవారం నగరంలో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మాట్లాడుతూ… నియోజకవర్గానికి ప్రతి ఏడాది కేటాయిస్తున్న 3,500 ఇందిరమ్మ ఇళ్లలో వెట్టి చాకిరి విముక్తి కార్మికులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరతానని చెప్పారు. వెట్టిచాకిరి, అక్రమ రవాణా సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ 8069 434343 ఆవిష్కరించారు. వెట్టి చాకిరి నిషేధించి దశాబ్దాలు గడుస్తున్నా… ఇప్పటికి కొనసాగడం అత్యంత దురదృష్టకరమన్నారు. మానవత్వానికి మాయనిమచ్చ అన్నారు. ఇకనుంచి ఫిబ్రవరి 9న వెట్టిచాకిరి విముక్తి దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని మంత్రి ప్రకటించారు. వెట్టి చాకిరి, మానవ అక్రమ రవాణా ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన 200 మందికిపైగా పెట్టి చాకిరి విముక్తి కార్మికులు ఎదుర్కొన్న బాధల గురించి విన్న తర్వాత ప్రముఖ నటి, బ్లూ క్రాస్ వ్యవస్థాపకురాలు అమల అక్కినేని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.వారి మాటలు తన మనసును కదిలించాయని, తన సహకారం ఉంటుందని చెప్పారు. కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్ మాట్లాడుతూ వెట్టిచాకిరికి పాల్పడుతున్న వ్యాపారులు, గుత్తేదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
