Dilsukhnagar Bomb Blast Case: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కాగా, 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో 18 మంది మృతి చెందగా, 130 మందికి గాయాలైన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన సంచలన రేపింది. ఉగ్రవాదులు టిఫిన్ బాక్సులో బాంబు పెట్టి పేలుళ్లు సృష్టించారు. ఈ బాంబు పేలుడు కేసులో కీలక సూత్రధారిగా ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడుగా యాసిన్ భత్కల్ ప్రధాన నిందితుడు. అయితే ప్రస్తుతం హైకోర్టు కింది కోర్టు తీర్పును సమర్పిస్తూ నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసింది.
2013 ఫిబ్రవరి 2న హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ రోజు రాత్రి 7 గంటల సమయంలో దిల్సుఖ్నగర్ బస్స్టాప్ దగ్గర భారీ పేలుడు జరిగింది. ఆ పేలుడు జరిగిన క్షణాల వ్యవధిలోనే కోణార్క్ థియేటర్ సమీపంలోని ఏ-1 మిర్చి సెంటర్ దగ్గర రెండో పేలుడు జరిగింది. ఈ పేలుళ్ల దాటికి మొత్తం 18 మంది మరణించగా..మరో 130 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడుపై సరూర్నగర్ పోలీసులు కేసు నమోదు చేసి..దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు కేంద్ర హోంశాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. దీంతో హైదరాబాద్లో నమోదైన ఈ రెండు కేసులు ఎన్ఐఏకి బదిలీ అయ్యాయి.
విచారణలో నేరం అంగీకరించిన నిందితులు:
ఇండియన్ ముజాహుద్దీన్ ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడినట్లు ఎన్ఐఏ గుర్తించింది. దర్యాప్తులో భాగంగా అహ్మద్ సిద్దిబప్ప జరార్ అలియాస్ యాసిన్ బత్కల్, అబ్దుల్లా అక్తర్ అలియాస్ హద్దిలను 2013లో ఇండో-నేపాల్ బోర్డర్ సమీపంలో అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు నేరం ఒప్పుకున్నారు.వాళ్లించిన సమాచారంతో బిహార్కు చెందిన తహసీన్ అక్తర్, పాకిస్థాన్కు చెందిన జియా ఉర్ రెహమాన్లను 2014 మేలో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు పుణేకు చెందిన అజిజ్ షేక్ను కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.
నిందితుల విచారణలో పేలుళ్లకు కీలక సూత్రధారి మహ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్గా గుర్తించారు. ప్రస్తుతం పాకిస్థాన్లో తలదాచుకున్న భత్కల్కోసం రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేసింది ఎన్ఐఏ. మరోవైపు ఘటనపై దర్యాప్తు చేసిన ఎన్ఐఏ ఆరుగురు నిందితులపై 3 చార్జిషీట్లు దాఖలు చేసింది. ఉగ్రవాద కార్యకలాపాల వ్యవహారంలో గతంలో నిందితులపై కేసులు ఉన్నట్లు గుర్తించింది. ప్రధాన నిందితుడు రియాజ్ భక్తల్ మినహా మిగిలిన ఐదుగురు నిందితులపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో 2015లో ట్రయల్ కొనసాగింది.
విచాణలో భాగంగా 157 మంది సాక్షులను ఎన్ఐఏ ప్రశ్నించింది. వారి నుంచి సేకరించిన ఆధారాలు ఎన్ఐఏ కోర్టుకు సమర్పించింది. 2016 డిసెంబర్ 13న ఐదుగురు నిందితులైన అసదుల్లా అక్తర్ అలియాస్ హద్ది, మహ్మద్ తహసీన్ అక్తర్ అలియాస్ హసన్ అలియాస్ మోను, జియా ఉర్ రహమాన్ అలియాస్ వఘాస్ అలియాస్ నబీల్ అహమ్మద్, యాసిన్ భత్కల్ అలియాస్ షారూఖ్, అజాజ్ షేక్ అలియాస్ సమర్ ఆర్మాన్ తుండె అలియాస్ సాగర్ అలియాస్ ఐజాజ్ సయ్యద్ షేక్లను దోషులుగా కోర్టు గుర్తించింది. 2016 డిసెంబర్ 13న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు దోషులకు జైలు శిక్ష, జరిమానాలతో పాటు ఉరిశిక్ష విధించింది. అయితే ఎన్ఐఏ కోర్టు తీర్పుపై నిందితులు అదే ఏడాది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి హైకోర్టులో నిందితుల పిటిషన్పై విచారణ జరుగుతోంది. నిందితులంతా ప్రస్తుతం వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు నిందితులకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
https://www.youtube.com/watch?v=u3sAu-dwn7I
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి