Rohit Sharma : పెర్త్‌లో చరిత్ర సృష్టించనున్న హిట్ మ్యాన్.. సచిన్, కోహ్లీ, ధోని తర్వాత ఆ మైలురాయి రోహిత్‌దే – Telugu News | Rohit Sharma Set to Play 500th International Match Against Australia in Perth ODI

Rohit Sharma : భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు చేరుకుంది. అక్టోబర్ 19 నుంచి ఈ పర్యటన ప్రారంభమవుతుంది. అదే రోజు పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. అయితే, ఆస్ట్రేలియాపై పర్త్‌లో జరగబోయే ఈ తొలి వన్డే మ్యాచ్ రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ బరిలోకి దిగితే, ఒక అరుదైన చరిత్రను సృష్టించబోతున్నాడు.

భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా అక్టోబర్ 19న పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరగబోయే తొలి వన్డే మ్యాచ్ రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయి కానుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటే, అది అతనికి 500వ అంతర్జాతీయ మ్యాచ్ అవుతుంది. 2007లో అరంగేట్రం చేసినప్పటి నుంచి రోహిత్ 67 టెస్టులు, 273 వన్డేలు, 159 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఈ అరుదైన మైలురాయిని అందుకోవడానికి రోహిత్ కేవలం ఒక మ్యాచ్ దూరంలో ఉన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో 500 మ్యాచ్‌లు ఆడిన ఐదో భారతీయ ఆటగాడిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించబోతున్నాడు. ఇప్పటివరకు కేవలం నలుగురు భారత దిగ్గజాలు మాత్రమే ఈ ఘనతను సాధించారు. వారిలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (664 మ్యాచ్‌లు), రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (550 మ్యాచ్‌లు), కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని (535 మ్యాచ్‌లు), మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ (504 మ్యాచ్‌లు). ఈ జాబితాలో చేరడం ద్వారా రోహిత్.. భారత క్రికెట్ చరిత్రలో తన స్థానాన్ని మరింత పదిలపరుచుకోనున్నాడు.

ప్రపంచవ్యాప్తంగా 500 లేదా అంతకంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన 10 మంది ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఇప్పుడు 11వ ఆటగాడిగా చేరనున్నారు. ఈ జాబితాలో నలుగురు భారతీయ క్రికెటర్లతో పాటు, శ్రీలంకకు చెందిన దిగ్గజాలు మాహేల జయవర్ధనే (652), కుమార్ సంగక్కర (594), సనత్ జయసూర్య (586), ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (560), పాకిస్తాన్ షాహిద్ అఫ్రిది (524), దక్షిణాఫ్రికాకు చెందిన జాక్వెస్ కలిస్ (519) ఉన్నారు. ఈ క్లబ్‌లో శ్రీలంక నుంచి అత్యధికంగా ముగ్గురు ఆటగాళ్లు ఉండగా, భారత్ నుంచి ఐదో ఆటగాడిగా రోహిత్ స్థానం దక్కించుకోనున్నాడు.

తన 500వ మ్యాచ్‌ ఆడటానికి ముందు రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్‌లో గణాంకాలు చాలా పవర్ఫుల్‎గా ఉన్నాయి. ఇప్పటివరకు 499 మ్యాచ్‌లలో అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 50 సెంచరీలతో 19,700 పరుగులు చేశాడు.

టెస్ట్ క్రికెట్: 12 సెంచరీలు, 4301 పరుగులు.

వన్డే క్రికెట్: 32 సెంచరీలు, 11,168 పరుగులు (వన్డేలలో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు).

టీ20 అంతర్జాతీయ క్రికెట్: 5 సెంచరీలు, 4231 పరుగులు (టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారతీయ ఆటగాడు).

ఈ అద్భుతమైన ప్రదర్శనతో రోహిత్ తన 500వ మ్యాచ్‌లోనూ అభిమానులను అలరిస్తాడని అందరూ ఆశిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment