గురువారం ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీశైల మల్లికార్జున స్వామిని ప్రధాని మోదీ దర్శించుకోనున్నారు. తర్వాత రూ.13,430 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
అలాగే డ్రోన్ సిటీకి శంకుస్థాపన వంటి కీలక కార్యక్రమాలలో పాల్గొననున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసి షెడ్యూల్ ప్రకా మొదీ పర్యటించనున్నారు. ఉదయం 9.50 గంటలకు కర్నూలు ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో మోదీ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సున్నిపెంట హెలీప్యాడ్కు వెళ్తారు. తర్వాత రోడ్డు మార్గంలో శ్రీశైలానికి బయలుదేరతారు.
శ్రీశైలంలో స్వామివారి దర్శనం
ఉదయం 10.55 గంటలకు శ్రీశైలం చేరుకుని, 11.15 గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు. 11:15 గంటల నుంచి 12:15 గంటల వరకు పూజలు చేసి దర్శనం చేసుకుంటారు. అనంతరం ఆలయాన్ని మొత్తం సందర్శిస్తారు. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలు, 52 శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రం. ఇక్కడ జ్యోతిర్లింగం, శక్తి పీఠం ఒకేచోట ఉండటం ప్రత్యేకత. అక్కడి నుంచి మధ్యాహ్నం 12.05 గంటలకు బయల్దేరి వెళ్లి శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శిస్తారు. అనంతరం 12.40 గంటలకు భ్రమరాంబ గెస్ట్ హౌస్కు చేరుకుంటారు. అక్కడే విశ్రాంతి తీసుకుని 1.40 గంటలకు సున్నిపెంట నుంచి కర్నూలుకు హెలికాప్టర్లో వెళ్తారు.
ఇక మధ్యాహ్నం 2:30 గంటలకు కర్నూలులోని పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. 13వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ పనులు విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతోపాటు మరిన్ని రంగాలను సంబంధించినవని సంబంధించినవని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత.. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్తో పాటు కూటమి నేతలతో కలిసి సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ పేరుతో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఇక సాయంత్రం 4:45కు కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.
మోదీ పర్యటనకు ఏర్పాట్లు
ప్రధాని మోదీ కర్నూలు పర్యటనకు కూటమి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. 12 మంది మంత్రుల బృందం కర్నూలులో మకాం వేసి.. ఏర్పాట్లను దగ్గర ఉండి పరిశీలిస్తున్నారు. ప్రధాని మోదీ సభకు భారీ జనసమీకరణకు కూటమి ప్లాన్ చేసింది. దాదాపు మూడు లక్షల మంది వరకూ కూర్చునేందుకు వీలుగా భారీ ఏర్పాట్లు చేశారు. 7 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అటు.. 7వేల 500 మందికి పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏపీ డీజీపీ హరీష్కుమార్ గుప్తా భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు.. ప్రధాని మోదీ కర్నూలు పర్యటనపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్ష చేశారు. మంత్రులు, కర్నూలు జిల్లా నేతలతో మాట్లాడారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ రాకతో శ్రీశైల క్షేత్రానికి ఒక మహర్ధశ రాబోతోందన్నారు సీఎం చంద్రబాబు.