ABN
, Publish Date – Mar 17 , 2025 | 04:41 AM
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్, మార్చి 16(ఆంధ్రజ్యోతి): ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పాలన అందిస్తామంటూ ఇచ్చిన ఏడో గ్యారెంటీని కాంగ్రెస్ తుంగలో తొక్కిందని ఆదివారం ఆయన ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. వర్సిటీ విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధించడం దుర్మార్గపు చర్య అని, ఇది ఎమర్జెన్సీ రోజులను గుర్తుచేస్తోందని పేర్కొన్నారు. విద్యార్థుల భోజనంలో పురుగులు, బ్లేడ్లు వస్తుండడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
అలాంటి దారుణాలు పునరావృతం కాకుండా చూడాల్సిన ప్రభుత్వం విద్యార్థుల గొంతు నొక్కుతోందన్నారు. కాంగ్రెస్, బీజేపీ సింగరేణి సంస్థను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. రెండు బొగ్గు బ్లాకులను ఇప్పటికే ప్రైవేటుపరం చేసి, ఇప్పుడు ఉన్నతస్థాయి ఉద్యోగాలను కూడా ప్రైవేటుకు కట్టబెట్టాలనుకోవడం మరో ప్రమాద హెచ్చరిక అని తెలిపారు. సింగరేణిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జంగ్ సైరన్ మోగిస్తామని హెచ్చరించారు.
Updated Date – Mar 17 , 2025 | 04:41 AM