– టీషర్టులు, బుక్స్ కొనుగోలు చేయాలని బెదిరింపులు
– దౌర్జన్యంగా వ్యహరిస్తున్న పలు ప్రైవేట్ స్కూళ్లు
– ఇబ్బందులు పడుతున్న పది, తొమ్మిదో తరగతి పిల్లలు
నగరంలోని పలు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. వార్షిక పరీక్షలు సమీపించిన నేపథ్యంలో విద్యార్థుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాయి. 2024-25 అకాడమిక్ ఇయర్ సందర్భంగా కొనుగోలు చేసిన వస్తువులు, పాఠ్య పుస్తకాల్లో మిగిలిపోయిన వాటిని పూర్తిగా విక్రయించాలనే ఉద్దేశంతో బలవంతంగా అంటగడుతుండడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు చేయని వారిని తరగతి గదుల్లో ఉపాధ్యాయులు సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
హైదరాబాద్ సిటీ: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 2,249 ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు నడుస్తుండగా.. వాటిలో సుమారు 9.30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, టై, బెల్టులు, షూస్(Textbooks, notebooks, ties, belts, shoes) తమ వద్దే కొనుగోలు చేయాలని నిబంధనలు విధిస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు.. తాజాగా వార్షిక పరీక్షలు జరిగే సమయంలో కూడా వసూళ్లకు దిగుతుండడంపై తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించే విధంగా విద్యార్థులను సన్నద్ధులను చేయాల్సిన టీచర్లు.. వసూళ్లకు ఒత్తిడి చేస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Trains: నెల రోజుల పాటు కాచిగూడ-నిజామాబాద్ డెమూ రైళ్లు రద్దు
టీషర్టులు, బుక్స్ కొనాలని..
మలక్పేట్లో ఓ పేరొందిన ప్రైవేట్ స్కూల్ నిర్వాహకులు నెలరోజులుగా తొమ్మిదో, పదో తరగతి విద్యార్థులను స్పోర్ట్స్ టీషర్టులు కొనుగోలు చేయాలని, పాఠ్యపుస్తకాలు తీసుకోవాలని తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు గతంలో కొనుగోలు చేయగా మిగిలిన టీషర్టులు బలవంతంగా అంటగడుతున్నారు. టీషర్టులు తాము ఇప్పటికే తీసుకున్నామని, ప్రస్తుతం అవసరం లేదని చెబుతున్నా.. పట్టించుకోవడం లేదు. దీంతో కొందరు తల్లిదండ్రుల నుంచి డబ్బులు తెచ్చుకుని కొనుగోలు చేస్తున్నారు.
కాగా, ఇదే స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న పిల్లలకు ఇప్పుడే టెన్త్ క్లాస్ బుక్స్ను విక్రయిస్తున్నారు. పరీక్షలు పూర్తయిన తర్వాత ఖాళీగా ఉండకుండా ఉండేందుకు బుక్స్ దోహదపడుతాయని, ఇప్పుడు తీసుకుంటే మీకే మంచిదని ఉచిత సలహా ఇస్తూ బలవంతం చేస్తున్నారు. నగరంలో ఈ ఒక్క పాఠశాలే కాదు.. చాలా స్కూళ్లు పిల్లలను వేధింపులకు గురిచేస్తున్నాయి. వార్షికోత్సవాలు, పదో తరగతి పిల్లలకు ఫేర్వెల్ పేరిట ఒక్కో విద్యార్థి నుంచి రూ.1000-2000 వరకు వసూలు చేస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇవ్వకుంటే అవమానాలే..!
వివిధ రకాల పేరిట స్కూల్ సిబ్బంది, ఉపాధ్యాయులు అడిగినంత ఇవ్వని విద్యార్థులకు తరగతి గదుల్లో అవమానాలే ఎదురవుతున్నాయి. చిన్నపాటి మొత్తాన్ని తీసుకురాని వారు ఎందుకు ఇక్కడ చేరారు.. తోటి విద్యార్థులు కడుతున్నా.. మీరెందుకు ఇవ్వరు? అంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. కాగా, ప్రతి ఏటా స్కూల్లో ఫీజుల భారం మోపుతూ యాజమాన్యాలు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, బలవంతపు వసూళ్లపై విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల దందా రోజురోజుకు పెరిగిపోతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఈవార్తను కూడా చదవండి: దక్షిణాది రాష్ట్రాల తిరుగుబాటు తప్పదు
ఈవార్తను కూడా చదవండి: ఆధార్ లేకున్నా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం
ఈవార్తను కూడా చదవండి: స్వయం ఉపాధి పథకాలకు రుణాలివ్వండి
ఈవార్తను కూడా చదవండి: ‘కింగ్ ఫిషర్’ తయారీని పరిశీలించిన మహిళా శిక్షణ కానిస్టేబుళ్లు
Read Latest Telangana News and National News
Updated Date – Mar 01 , 2025 | 11:21 AM