అగ్ర కథానాయకుడు చిరంజీవికి మరో అరుదైన గౌరవం లభించనుంది. హౌస్ ఆఫ్ కామన్స్ – యు.కె పార్లమెంట్లో గౌరవ సత్కారం జరగనున్నది. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకుగానూ యుకెకి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా చిరంజీవిని ఈనెల 19న సన్మానించనున్నారు. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ, సినిమా, ప్రజాసేవ, దాతత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం ‘జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేయనున్నారు.
బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది యు.కెలో ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీని రూపొందించడానికి పనిచేస్తుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు..వారు తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించిన ప్రభావం మరింత విస్తతం కావాలనే ఉద్దేశంతో వారిని సత్కరిస్తుంటుంది. బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ ఆచీవ్మెంట్ అవార్డును తొలిసారిగా అందజేస్తోంది. దాన్ని చిరంజీవి అందుకోనుండటం విశేషం. ఇది ఆయన కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలుస్తుంది. యు.కెకు చెందిన పార్లమెంట్ సభ్యులు, బ్రిడ్జ్ ఇండియా వంటి ప్రఖ్యాత సంస్థ అంతర్జాతీయ వేదికపై చిరంజీని సన్మానించటం, ఆయనకు లైఫ్ టైమ్ ఆచీవ్మెంట్ అవార్డ్ ఇవ్వటం అనేది ప్రత్యేకమైన సందర్భం. 2024లో భారత ప్రభుత్వం నుంచి రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ను చిరంజీవి అందుకున్నారు. అలాగే గత ఏడాది అత్యంత సమర్ధవంతమైన నటుడు, డ్యాన్సర్గా గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో స్థానం సొంతం చేసుకున్నారు. ఎ.ఎన్.ఆర్ శత జయంతి సందర్భంగా అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 2024లో చిరంజీవికి ప్రతిష్టాత్మక ఎ.ఎన్.ఆర్ జాతీయ అవార్డును ప్రదానం చేసింది.

మరో అరుదైన గౌరవం –
Written by RAJU
Published on: