
జీలియో ఈ-మొబిలిటీ 10 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న టీనేజ్ రైడర్ల కోసం రూపొందించిన లైసెన్స్ లెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లిటిల్ గ్రేసీని పరిచయం చేసింది. ఈ కొత్త మోడల్ ధర రూ.49,500గా ఉంది. ఈ స్కూటర్ కొనుగోలు చేస్తే ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ)లో రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. లిటిల్ గ్రేసీ బ్యాటరీ ఎంపికల ద్వారా విభిన్నమైన మూడు వేరియంట్లలో వస్తుంది. బేస్ మోడల్లో 48వీ/32ఏహెచ్ లీడ్ యాసిడ్ బ్యాటరీ ధర రూ.49,500. దీని పరిధి 55-60 కి.మీగా ఉంది. మిడ్-టైర్ ఎంపికలో 60వీ/32ఏహెచ్ లీడ్ యాసిడ్ బ్యాటరీ రూ.52,000. ఈ వెర్షన్ పరిధి 70 కి.మీగా ఉంది. అలాగే ప్రీమియం వేరియంట్ 60వీ/30 ఏహెచ్ లి-అయాన్ బ్యాటరీతో వచ్చే స్కూటర్ ధర రూ.58,000గా ఉంటే పరిధి మాత్రం 70-75 కి.మీగా ఉంది.
లిటిల్ గ్రేసీ అన్ని మోడళ్లు గరిష్టంగా గంటకు 25 కి.మీ వేగంతో ప్రయాణించగలవు. అలాగే ఒకసారి ఛార్జ్ చేయడానికి దాదాపు 1.5 యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తాయి. ఈ స్కూటర్ బరువు 80 కిలోలుగా ఉంటే 150 కిలోల లోడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. యువ రైడర్లకు స్థిరమైన రవాణాను అందుబాటులోకి తెచ్చే ఉత్పత్తిని పరిచయం చేయడం సంతోషంగా ఉందని జీలియో ఈ-మొబిలిటీ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ కునాల్ ఆర్య అన్నారు. ఈ స్కూటర్లో డిజిటల్ మీటర్, యూఎస్బీ పోర్ట్, కీలెస్ డ్రైవ్, యాంటీ-థెఫ్ట్ అలారంతో సెంటర్ లాక్, రివర్స్ గేర్, పార్కింగ్ స్విచ్, ఆటో-రిపేర్ ఫంక్షనాలిటీ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి.
జీలియో ఈ-మొబిలిటీ లిటిల్ గ్రేసీ హైడ్రాలిక్ సస్పెన్షన్, డ్రమ్ బ్రేక్లతో కూడా వస్తుంది. ఈ స్కూటర్ పింక్, బ్రౌన్/క్రీమ్, వైట్/బ్లూ, ఎల్లో/గ్రీన్ కలర్స్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ స్కూటర్ మోటార్, కంట్రోలర్, ఫ్రేమ్ను కవర్ చేసే రెండు సంవత్సరాల వారెంటీని అందిస్తుంది. జీలియో ఈ-మొబిలిటీకి దేశవ్యాప్తంగా రెండు లక్షల కంటే ఎక్కువ కస్టమర్లు ఉన్నారు. అలాగే 400 కంటే ఎక్కువ డీలర్షిప్లు ఉన్నాయి. జీలియో ఈ-మొబిలిటీ 2025 చివరి నాటికి 1,000 కంటే ఎక్కువ డీలర్షిప్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి