
దిశ, తెలంగాణ బ్యూరో: (Gulf workers) గల్ఫ్ కార్మికుల గోడును విన్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) వెంటనే స్పందించారు. కేసీఆర్ ఆదేశాలతో జోర్డాన్లో చిక్కుకున్న 12 మందిని రప్పించాలని నిశ్చయించుకున్నారు. 12 మందికి స్వయంగా తానే ఫోన్ చేసి ‘ధైర్యంగా ఉండండి.. ఎట్లయినా మిమ్మల్ని తెలంగాణకు తీసుకువస్తాం’ అని భరోసా ఇచ్చారు. ఒకవైపు జోర్డాన్ గల్ఫ్ కార్మికుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ సహా మీడియా దృష్టికి తీసుకువెళ్లిన హరీశ్రావు, మరోవైపు బీఆర్ఎస్ ఎంపీ సురేశ్రెడ్డి ద్వారా భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. ఇంకోవైపు సంబంధిత కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో పెనాల్టీ చెల్లించి వారిని తెలంగాణకు తీసుకెళ్లవచ్చని కంపెనీ చెప్పగా దానికి అంగీకరించారు. గల్ఫ్ కార్మికుల ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా చెల్లించాల్సిన మొత్తం తో పాటు, స్వదేశానికి రావడానికి అయ్యే విమాన టికెట్లను సైతం హరీశ్రావు భరించారు. దీంతో విమాన టికెట్ల బుకింగ్ ప్రక్రియ సైతం పూర్తయింది. మరో వారంలో నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల, సిద్దిపేటకు చెందిన 12 మంది గల్ఫ్ కార్మికులు తెలంగాణ గడ్డపై అడుగుపెట్టబోతున్నారు.
సుదీర్ఘ కాలం ఎదురుచూపుల తర్వాత వారి కుటుంబాలను కలుసుకోబోతున్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు స్పందిస్తూ.. కేసీఆర్ ఆదేశాలతో జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది కార్మికులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు అన్ని విధాలా ఏర్పాట్లు చేశామన్నారు. వారం రోజుల్లో ఇక్కడకు చేరుకుంటారని తెలిపారు. కేసీఆర్ పాలనలో వలసలు వాపస్ అయితే.. రేవంత్ 22 నెలల పాలనలో వలసలు మళ్లీ మొదలయ్యాయని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లుగానే, గల్ఫ్ కార్మికులను సైతం కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సంక్షేమ బోర్డు ఇప్పటికీ అతీగతి లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.