50శాతంతోనే ఎన్నికలకు వెళ్లండి

తెలంగాణ సర్కార్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ డిస్మిస్‌
ఈ అంశం హైకోర్టులో ఉన్నందున విచారణకు నిరాకరణ
మెరిట్స్‌ ప్రకారమే విచారణ చేపట్టాలని హైకోర్టుకు సూచన

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన హైకోర్టు స్టేను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్‌ చేసింది. ఈ అంశం ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. అయితే తమ ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని, మెరిట్స్‌ ప్రకారమే ముందుకెళ్లాలని హైకోర్టుకు సూచించింది. ఒక వేళ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలంటే పాత రిజర్వేషన్ల ఆధారంగా వెళ్లొచ్చని స్పష్టత ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 9ని తీసుకువచ్చింది. అయితే.. ఈ జీవోను మాధవ రెడ్డి, మరొకరు రాష్ట్ర హైకోర్టులో సవాల్‌ చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం జీవోపై ఈనెల 9న స్టే విధించింది.

దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 13న సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను గురువారం జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ, ప్రతివాదుల తరపున సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకర్‌ నారాయణ్‌, కె.వివేక్‌ రెడ్డి, మయూర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. తొలుత సింఘ్వీ వాదనలు వినిపిస్తూ… రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. తెలంగాణ బీసీ బిల్లుకు రాష్ట్రపతి, గవర్నర్‌ ఆమోదం ఇవ్వలేదని కోర్టుకు నివేదించారు.

అయితే అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపాయని చెప్పారు. శాస్త్రీయంగా కుల సర్వే నిర్వహించి, డేటా బేస్‌ ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించుకోవచ్చని ఇందిరా సాహ్నీ కేసులో తొమ్మిది మంది జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిందని చెప్పారు. ‘దేశంలో ఎక్కడా లేని విధంగా పకడ్బందీ సర్వే నిర్వహించాం. గవర్నర్‌ బిల్లు పెండింగ్‌లో పెట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఏకాభిప్రాయంతో ఆమోదించిన బిల్లును పెండింగ్‌లో పెట్టారు. బిల్లును ఛాలెంజ్‌ చేయకుండా బిల్లు ద్వారా విడుదల చేసిన జీవోను సవాల్‌ చేశారు. రిజర్వేషన్లను పెంచుకునే సౌలభ్యం ఉంది. సుప్రీంకోర్టు విధించిన ట్రిపుల్‌ టెస్ట్‌ కండిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది’ అని నివేదించారు.

శాస్త్రీయంగా చేపట్టాం..
దేశంలోనే తొలిసారి శాస్త్రీయంగా బీసీల లెక్కలు తీసీ, తద్వారా రిజర్లేషన్ల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లిందని సింఘ్వీ వాదించారు. ‘డెడికేట్‌ కమిషన్‌ ద్వారా సర్వే జరిపి వెంపరికల్‌ డేటా సేకరించింది. కమిషన్‌ సిఫారసు ప్రకారం.. రిజర్వేషన్లు నిర్ణయించాం. బీసీ జనాభా డేటా ఆధారంగానే బీసీల రిజర్వేషన్లు పెంచాము. ఇంటింటికి తిరిగి సామాజిక ఆర్థిక కుల సర్వే నిర్వహించాం. సమగ్రంగా, సాంకేతికంగా సర్వే జరిపాం. అన్ని వర్గాలతో విస్తత సంప్రదింపులు జరిపాం. ఇండియాలో ఎక్కడా లేని విధంగా ఈ సర్వే నిర్వహించాం. దీనిపై స్టే ఎలా విధిస్తారు? హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో ఎలాంటి సహేతుక కారణాలు వెల్లడించలేదు. వెంపరికల్‌ డేటా ద్వారా ట్రిపుల్‌ టెస్ట్‌ నిర్వహించి రిజర్వేషన్లు పెంచుకోవచ్చని గౌలి కెసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది’ అని గుర్తు చేశారు. అయితే అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు గవర్నర్‌, రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

మార్చిలో ఈ బిల్లులను గవర్నర్‌కు పంపామని, గవర్నర్‌ ఈ బిల్లులను రాష్ట్రపతికి పంపి ఊరుకున్నారని తెలిపారు. అయితే రాష్ట్రపతి, గవర్నర్ల నుంచి నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. 119 మంది ఎమ్మెల్యేలు కలిసి ఏకగ్రీవంగా చేసిన నిర్ణయాన్ని పెండింగ్‌లో పెడితే ఎలా అని సింఘ్వీ ప్రశ్నించారు. మధ్యలో ధర్మాసనం జోక్యం చేసుకొని… రిజర్వేషన్ల జీవో ఇచ్చే ముందు బిల్లుకు నోటిఫికేషన్‌ ఇచ్చారా? అని ప్రభుత్వాన్ని అడిగింది. ఇందుకు సింఘ్వీ బదులిస్తూ… గవర్నర్‌ బిల్లులను ఆమోదించనప్పుడు గవాయి కేసులో గైడ్‌ లైన్స్‌ ఫాలో అయి జీవో 9ని జారీ చేసినట్టు చెప్పారు. ఈ విషయంలో శాస్త్రీయంగానే ముందుకెళ్లినట్టు తెలిపారు. మరోసారి స్పందించిన ధర్మాసనం… రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జీవో 9ని ఇచ్చారని, అదే రోజు ఎలక్షన్‌ నోటిఫికేషన్‌ హడావుడిగా ఇవ్వడానికి కారణమేంటని ప్రశ్నించింది. చట్ట సభలో అన్ని రాజకీయ పార్టీల ఆమోదం తర్వాతే.. ప్రజా ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ చట్టాన్ని ఎవరు సవాల్‌ చేయలేరని ప్రభుత్వం తెలిపింది.

చట్టాన్ని కాదు… 67 శాతం రిజర్వేషన్లను సవాల్‌ చేస్తున్నాం: ప్రతివాది అడ్వొకేట్‌ నారాయణ్‌
ఈ వాదనలపై ప్రతివాది తరపున గోపాల్‌ శంకర్‌ నారాయణ్‌ అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన సర్వే, క్యాబినెట్‌ నిర్ణయాలను తప్పుబట్టడం లేదని, కేవలం రాజ్యాంగంలోని నిబంధనలకు వ్యతిరేకంగా ఓబీసీ రిజర్వేషన్లు పెంచడాన్ని సవాల్‌ చేస్తున్నట్టు చెప్పారు. ‘ఎన్నికల్ని సవాల్‌ చేయడం లేదు. పెంచిన బీసీ రిజర్వేషన్లను కలుపుకొని 67 శాతానికి పెరుగుతున్న రిజర్వేషన్లను సవాల్‌ చేస్తున్నాం.’ అని నారాయణ్‌ చెప్పారు. మధ్యలో కోర్టు జోక్యం చేసుకొని… రిజర్వేషన్లు 50 మించకూడదంటే ఎస్సీ, ఎస్టీలకు తగ్గించాల్సి వస్తుంది కదా? అని ప్రశ్నించారు. అవునని ప్రతివాది అడ్వొకేట్లు బదులిచ్చారు. రాజ్యాంగంలోని పలు ఆర్టికల్స్‌ ప్రకారం… రిజర్వేషన్లు 50 శాతం మించ కూడదని అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. షెడ్యూల్డ్‌ ఏరియా, గిరిజన ప్రాంతాల్లో మాత్రమే 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచకూడదనే స్పష్టమైన తీర్పు ఉందన్నారు.

తెలంగాణలో అలాంటి షెడ్యూల్‌ ఏరియాలు లేవని కోర్టుకు నివేదించారు. కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇదే తీర్పు వెలువరించిందని గుర్తు చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోనూ ప్రజా ప్రభుత్వాలు రిజర్వేషన్ల పెంపుపై చేసిన నిర్ణయాలను సుప్రీంకోర్టు తిరస్కరించిందన్నారు. 50 శాతానికి మించకుండా ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించిం దన్నారు. ట్రిపుల్‌ టెస్ట్‌ లో కూడా 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండవు అని వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తున్నట్టు వెల్లడించిం ది. అయితే సింఘ్వీ జోక్యం చేసుకొని ప్రస్తుతం ఈ అంశం హైకోర్టులో ఉందన్నారు. అయితే ఈ విషయాన్ని అక్కడే తేల్చుకోవాలని, హైకోర్టు మెరిట్స్‌లోకి వెళ్లాలని సూచించింది. వీలైతే పాత రిజర్వేషన్ల ప్రకారమే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లొచ్చని స్పష్టం చేసింది.

The post 50శాతంతోనే ఎన్నికలకు వెళ్లండి appeared first on Navatelangana.

Leave a Comment