– Advertisement –
మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యలు
ముంబయి : అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో ఒత్తిడిని ఎదుర్కొవటం, భిన్న పరిస్థితులకు అనుగుణంగా ఆటలో మార్పులు చేసుకోవటం సహా అపూర్వ అనుభవం కోసం భారత క్రికెటర్లు సైతం విదేశీ టీ20 లీగ్ల్లో ఆడాలని భారత జట్టు మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన క్రికెటర్లకు మాత్రమే బీసీసీఐ ఎన్ఓసీ (నిరభ్యంతర పత్రం) జారీ చేస్తోంది. ఇటీవల ఐపీఎల్ సహా అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్.. బిగ్బాష్ లీగ్లో సిడ్నీ థండర్ జట్టుతో చేరాడు. ఇటువంటి అవకాశాలు యువ క్రికెటర్లకు దక్కాలని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
భారత్ ఎంతో విశాలమైన దేశం. ప్రతి ఒక్కరికి క్రికెట్ జట్టులో చోటు దక్కదు. ఆశావహులు అందరికీ ఐపీఎల్లో అవకాశం లభించదు. మరి ఎందుకు, యువ క్రికెటర్ల విదేశీ లీగ్ అవకాశాలను అడ్డుకోవటం?. విదేశీ లీగ్లో గడించిన అనుభవం ఆ క్రికెటర్లకు ఇక్కడ దేశవాళీలో ఉపయోగపడుతుంది. ఐపీఎల్తో యువ క్రికెటర్లు లబ్ది పొందినట్టే.. విదేశీ లీగ్ల్లో ప్రపంచ శ్రేణి క్రికెటర్లతో ఆడిన అనుభవం మన క్రికెటర్లకు దక్కుతుంది. ఒత్తిడి పరిస్థితులను ఎలా ఎదుర్కొవాలో నేర్చుకుంటారు. దిగ్గజ క్రికెటర్లు పాంటింగ్, ఫ్లెమింగ్ వంటి శిక్షణలో రాటుదేలుతారు. విదేశీ లీగ్ల్లో క్రికెట్ ఆడటం నాకు తెలిసి ఓ ఎడ్యుకేషన్. క్రికెట్ నేర్చుకునే, ఆడే పద్దతులు ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటాయి. భిన్న పరిస్థితులను అర్థం చేసుకోవటంతో నాణ్యమైన క్రికెటర్లు తయారవుతారు’ అని రవిశాస్త్రి అన్నాడు.
– Advertisement –