ప్రస్తుతం ఇండియా, పాకిస్తాన్ తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఓ పాకిస్థాన్ క్రికెటర్ మాత్రం వచ్చే ఇండియా వచ్చి, ఐపీఎల్ ఆడుతానంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజానికి పాక్ ఆటగాళ్లకు ఐపీఎల్ ఆడేందుకు అవకాశం లేదు. ఎప్పటి నుంచో ఆ దేశపు క్రికెటర్లపై నిషేధం ఉంది. కానీ, కొంతమంది పాకిస్థాన్ క్రికెటర్లు వేరే దేశాలకు వలస వెళ్లి ఆ దేశ పౌరసత్వం పొంది, ఇండియాలో జరిగే ఐపీఎల్లో పాక్ క్రికెటర్లుగా కాకుండా ఇతర దేశాల పౌరులుగా ఆడాలని అనుకుంటున్నారు. పాకిస్థాన్ వెటరన్ పేసర్ మొహమ్మద్ అమీర్ కూడా ఐపీఎల్లో ఆడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. అందుకోసం అతను కెనడాకు వలస వెళ్లి, ఆ దేశపు పౌరసత్వం పొంది ఐపీఎల్లో ఆడేందుకు రెడీ అవుతున్నాడని గతంలో వార్తలు వచ్చాయి.
కానీ, తాజాగా అమీర్ వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడే అంశంపై స్పందించాడు. అవకాశం వస్తే పాకిస్థాన్లో జరిగే పీఎస్ఎల్ను కాదని ఐపీఎల్ను ఎంచుకుంటానని పేర్కొన్నాడు. ప్రస్తుతం అమీర్ పీఎస్ఎల్లోని క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్లో ఆడే అవకాశం వస్తే, మీరు పీఎస్ఎల్, ఐపీఎల్ ఎందులో ఆడాలని అనుకుంటారు అని ఎదురైన ప్రశ్నకు అమీర్ బదులిస్తూ.. నిజాయితీగా చెప్పాలంటే, నాకు అవకాశం వస్తే, నేను కచ్చితంగా ఐపీఎల్లో ఆడతాను. ఐపీఎల్లో అవకాశం రాకపోతే, అప్పుడు పీఎస్ఎల్లో ఆడతాను. వచ్చే ఏడాది నాటికి నాకు ఐపీఎల్లో ఆడే అవకాశం ఉంటుంది, నిజంగా అవకాశం ఇస్తే ఐపీఎల్ ఆడతాను అని అమీర్ చెప్పాడు. అయినా వచ్చే ఏడాది ఐపీఎల్, పీఎస్ఎల్ ఒకే టైమ్లో జరుగుతాయని నేను అనుకోను.
ఒక వేళ రెండు ఒక టైమ్లో జరిగితే.. ఈ లీగ్ ఆక్షన్ ముందు జరిగితే.. ఎవరు నన్ను ముందు తీసుకుంటే ఆ లీగ్లో ఆడతాను అని పాక్ క్రికెటర్ అన్నాడు. అమీర్ ఐపీఎల్లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. అతని ఆశలు నెరవేరడం కష్టమే. ముఖ్యంగా ఇటీవల కశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మందికి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడి తర్వాత రెండు దేశాల మధ్య ఐసీసీ ఈమెంట్స్లో కూడా క్రికెట్ మ్యాచ్లు జరిగే అవకాశం లేకుండా పోతుంది. బీసీసీఐ కూడా ఐపీఎల్లో పాకిస్తాన్ ఆటగాళ్లను అనుమతించకుండా ఉన్న నిషేధాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్లు బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…