
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడిపై ఇప్పటికే ఎన్ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) దర్యాప్తు మొదలుపెట్టింది. అయితే.. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు రెండేళ్ల క్రితమే పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు ముసా, అలీ రెండేళ్ల క్రితమే ఇండియాకు దొంగదారిలో వచ్చి థోకర్ కశ్మీర్లో స్థానిక గైడ్లుగా పనిచేస్తున్నారు. దక్షిణ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలోని గుర్రే గ్రామానికి చెందిన థోకర్, 2018లో పాకిస్తాన్కు వెళ్లి గత సంవత్సరం లోయకు తిరిగి వచ్చాడని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. శిక్షణ పొందిన పాకిస్తానీ ఉగ్రవాదులకు అతను స్థానిక మార్గదర్శిగా వ్యవహరించాడని అధికారులు భావిస్తున్నారు.
కిష్త్వార్ వైపు వెళ్లే ముందు ముసా సాంబా, కథువా సెక్టార్ల ద్వారా ఇండియాలోకి చొరబడ్డాడని సమాచారం. మూసా సెప్టెంబర్ 2023లో ఇండియా నుంచి బుద్గాం జిల్లాలో ప్రధానంగా చురుగ్గా ఉండేవాడని, మూసా తర్వాత అలీ ఇండియాలోకి ప్రవేశించి శ్రీనగర్ నగర శివార్లలోని దచిగాం అడవులలో కార్యకలాపాలు నిర్వహించేవాడని తెలుస్తోంది. ఈ ఇద్దరు పాకిస్తానీ ఉగ్రవాదులకు దాదాపు 15 మంది స్థానిక కశ్మీరీ OGW(ఓవర్ గ్రౌండ్ వర్కర్లు), ఉగ్రవాద సహాయకులు సహాయం చేశారని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. వీరి ద్వారానే పాకిస్తాన్ నుండి ఆయుధాలు కూడా ఉగ్రవాదులకు అందాయి.
కాగా దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకోవడానికి భద్రతా దళాలు విస్తృతమైన ఆపరేషన్లు ప్రారంభించాయి. పహల్గామ్ మారణహోమం తరువాత బైసరన్ సమీపంలోని దట్టమైన అడవుల్లోకి పారిపోయారని అధికారులు అనుమానిస్తున్నారు. అనంత్నాగ్లోని పహల్గామ్ తహసీల్లోని హపత్ నార్ గ్రామ సమీపంలోని అడవుల్లో ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలు మొదట గుర్తించాయి, కానీ, ఉగ్రవాదులు అక్కడి నుంచి తప్పించుకున్నారని నివేదికలు చెబుతున్నాయి. తరువాత వారు కుల్గాం అడవుల్లో కనిపించగా, అక్కడ భద్రతా దళాలు వారిపై కాల్పులు కూడా జరిపాయి, కానీ అక్కడ్నుంచి కూడా వాళ్లు తప్పించుకున్నారు. ప్రస్తుతం ఉగ్రవాదులు మరలా ట్రాల్ శిఖరం, కోకెర్నాగ్లో ఉన్నట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి