అమలాపురం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): మానవాళి మనుగడకు నీరే ప్రాణాధారమని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ పేర్కొన్నారు. జల వనరుల భద్రతతోనే భవిష్యత్తు తరాలు సురక్షితంగా మనగలుగుతాయన్నారు. ప్రపంచ జల దినోత్సవాన్ని శనివారం కలెక్టరేట్లో నాబార్డు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఎదురయ్యే నీటి యాజమాన్య సవాళ్లను వివరించారు. ‘మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీటి వనరుల పరిరక్షణ’ అనే అంశంపై జాతీయ జలనవరుల సంస్థకు చెందిన శాస్త్రవేత్త వై.శివప్రసాద్ తన పరిశోధనా అంశాలను వివరించారు. జిల్లా అటవీ అధికారి ఎంవీ ప్రసాదరావు మాట్లాడుతూ మడ అడవుల పరిరక్షణ, ఉప్పునీటి ప్రవాహాలతో ముప్పు తదితర అంశాలపై చర్చించారు. భవిష్యత్తులో వాతావరణంలో మార్పులు.. జలవనరులపై దాని ప్రభావం.. ఎదుర్కొవలసిన సవాళ్లు అనే అంశంపై రూపొందించిన పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. నాబార్డు డీడీఎం డాక్టర్ వైఎస్ నాయుడు, ఎల్డీఎం కేశవవర్మ తదితరులు నీటి వనరుల ప్రాధాన్యతను వివరించారు.