అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం దిగుమతులపై విధిస్తున్న సుంకాలతో షాపింగ్ మాల్స్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. దిగుమతి సుంకాల పెంపు కారణంగా ధరలు పెరగనుండడంతో, వస్తువుల ధరలు పెరగకముందే కొనుగోలు చేసేందుకు ప్రజలు షాపింగ్ మాల్స్ కు క్యూ కడుతున్నారు. దీంతో ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన సుంకాలు ఏప్రిల్ 5 నుంచి అమలులోకి వచ్చాయి. ప్రారంభంలో 10% సుంకం వసూలు చేసినప్పటికీ.. మిగిలిన మొత్తాన్ని ఏప్రిల్ 10 నుంచి విధిస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే, కొన్ని దిగుమతులకు మే 27 వరకు గ్రేస్ పీరియడ్ ఉండటంతో ఆ లోపు సరుకులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత మొదలైంది. రెవెన్యూ సర్వీసుల నుంచి 20 వేల మంది తొలగించారు. ఖర్చులు తగ్గించుకునేందుకే ఉద్యోగాల కోత విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
కంబోడియాపై అత్యధికంగా 49 శాతం పన్నులు.. భారత్పై 26, చైనాపై 34 శాతం
అమెరికాకు దిగుమతయ్యే అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం 10 శాతం టారీఫ్లు విధించిన అధ్యక్షుడు ట్రంప్.. అత్యధికంగా కంబోడియాపై 49 శాతం వరకు పన్నులు విధించారు. భారత్పై 26 శాతం, చైనాపై 34 శాతం, ఐరోపా దేశాలపై 20 శాతం వరకు సుంకాలు విధించారు. దీంలో అమెరికా విధించిన టారిఫ్లపై చైనా సీరియస్గా స్పందించి.. ప్రతీకార సుంకాలు ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అమెరికాకు మాత్రమే విధించే ఈ టారిఫ్లు ఈ నెల 9 నుంచే అమల్లోకి వస్తాయని చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది. చైనా ప్రతీకార సుంకాలపై స్పందించారు ట్రంప్. చైనా భయపడింది.. తప్పు నిర్ణయం తీసుకుంది.. మరో మార్గం లేకే.. ఈనిర్ణయం తీసుకుందని తప్పుబట్టారు ట్రంప్. ఇదిలా ఉంటే బ్రిటన్లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఎగుమతులకు బ్రేక్ పడింది. ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో అమెరికాకు దిగుమతయ్యే వాహనాలపై.. 25 శాతం ట్యాక్స్ విధించడంతో జేఎల్ఆర్ ఈనిర్ణయం తీసుకుంది.
గోల్డ్ కార్డు ఆవిష్కరించిన ట్రంప్
మరోవైపు పెట్టుబడుల కోసం అమెరికా పౌరసత్వానికి వీలు కల్పించే గోల్డ్ కార్డును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవిష్కరించారు. 35 ఏండ్ల క్రితం ప్రవేశపెట్టిన ఈబీ-5 ఇన్వెస్టర్ వీసాల స్థానంలో వీటిని తీసుకొచ్చారు. సుమారు రూ.43 కోట్లు చెల్లించి ఈ కార్డును పొందొచ్చని ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ చర్యలతో ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుంకాల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి… నిరుద్యోగం, ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింత దిగజార్చే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు మాజీ అధ్యక్షుడు ఒబామా. ట్రంప్ టారిఫ్లతో అమెరికాకు ఒరిగేదేం లేదన్నారు. తాజా పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు ఒబామా. మరోవైపు ట్రంప్ పరిపాలన చర్యలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా 50 రాష్ట్రాల్లో నిరసన కారులు ఆందోళనకు దిగారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..