మే 9వ తేదీలోపే పాకిస్తాన్ మీద భారత్ ఎటాక్ చేయబోతోందా? పహల్గామ్లో ఉగ్రదాడి చేసిన పాకిస్తాన్ని రౌండప్ చేసే ప్రక్రియలో సైనికచర్య ఖాయమా? ఢిల్లీలో సాగుతున్న వరుస సమావేశాలు ఈ విషయాన్నే చెబుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత వ్యూహరచనలో కేంద్రం బిజీ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుస సమావేశాలు నిర్వహించడం కీలకంగా మారింది. ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ ప్రధాని మోదీతో భేటీ కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
పహల్గామ్లో ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్తో ప్రధానమంత్రి నివాసంలో సమావేశమయ్యారు. ఇద్దరి మధ్య 40 నిమిసాల పాటు సమావేశం కొనసాగింది. సరిహద్దుల్లో వాయుసేన సన్నాహకాలను ప్రధాని ఆయన వివరించారు. శనివారం నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి ప్రధానితో సమావేశం అయ్యారు. పాకిస్తాన్ను దీటుగా ఎదుర్కోవడానికి నేవీ ఎలాంటి చర్యలు చేపట్టిందో ప్రధానికి త్రిపాఠి వివరించారు. అంతేకాదు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధానితో సమావేశం కావడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.
వైమానిక దళ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ తో ప్రధాని మోదీ జరిపిన ఈ సమావేశంలో, పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత వైమానిక దళం సన్నద్ధత గురించి చర్చించారు. 2019 ఫిబ్రవరిలో పుల్వామాలో జరిగిన చివరి పెద్ద ఉగ్రవాద దాడికి భారత వైమానిక దళం జెట్ విమానాలతో గట్టి బుద్ధి చెప్పింది. పాకిస్తాన్లోని బాలాకోట్పై బాంబు దాడి చేయడం ద్వారా ప్రతిస్పందించింది పాక్. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఎయిర్ చీఫ్ మార్షల్ మధ్య జరిగిన ఈ సమావేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. పహల్గామ్ దాడి తర్వాత ప్రధాని మోదీ ఎయిర్ చీఫ్ మార్షల్తో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.
పుల్వామా దాడికి పాకిస్తాన్కు భారతదేశం తగిన సమాధానం ఇచ్చింది. అప్పటి నుండి భారత వైమానిక దళ బలం దీర్ఘ-శ్రేణి క్షిపణులు, వైమానిక రక్షణ పరంగా గణనీయంగా పెరిగింది. బాలకోట్ దాడి తర్వాత ప్రవేశపెట్టిన రాఫెల్ జెట్లు లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించగల క్షిపణులతో అమర్చారు. పుల్వామా దాడి తర్వాత, పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని అతిపెద్ద ఉగ్రవాద దాడిగా పరిగణిస్తున్నారు. ఈ కారణంగా, ఈ దాడికి సంబంధించి ప్రధాని మోదీ నిరంతరం ఆర్మీ చీఫ్, ఎయిర్ చీఫ్, నేవీ చీఫ్లతో సమావేశమై చర్చిస్తున్నారు. ఈ దాడి ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగింది. ఈ దుర్ఘటనలో, ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు. పర్యాటకులపై కాల్పులు జరిపారు. 26 మంది మరణించారు. అదే సమయంలో, చాలా మంది గాయపడ్డారు.
పహల్గామ్ దాడి తర్వాత, ప్రధాని మోదీ యాక్షన్ మోడ్లో ఉన్నారు. ఏప్రిల్ 29న జాతీయ భద్రతపై ఒక ముఖ్యమైన ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ప్రధాని. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, త్రివిధ దళాల అధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ అనిల్ చౌహాన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో, ఉగ్రవాదులు, వారి వెనుక ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. సైన్యం ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ విధంగా కావాలంటే ఆ ఆపరేషన్ నిర్వహించుకునే స్వేచ్ఛ ఉందని ప్రధాని స్పష్టం చేశారు. దీంతో త్రివిధ దళాలు దూకుడు పెంచాయి. దీంతో పాకిస్థాన్ వెన్నులో వణుకుపుడుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..