ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అమెరికన్ పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మాన్ జరిపిన పాడ్కాస్ట్ ఆదివారం (మార్చి 16) విడుదల కానుంది. ఈ విషయాన్ని లెక్స్ ఫ్రిడ్మాన్ ఎక్స్ అకౌంట్ వేదికగా వెల్లడించారు. ప్రధాని మోదీతో 3 గంటల పాటు సంభాషణ జరిపినట్లు లెక్స్ ఫ్రిడ్మాన్ తెలిపారు. ఇది తన జీవితంలో అత్యుత్తమ అనుభవాలలో ఒకటిగా అభివర్ణించారు. “నేను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో 3 గంటల పాడ్కాస్ట్ సంభాషణ చేశాను.
ఇది నా జీవితంలో జరిగిన అత్యుత్తమ సంభాషణలలో ఒకటి. “ఇది రేపు ప్రసారం అవుతుంది” అని లెక్స్ పోస్ట్ చేశారు. ప్రధాన మంత్రి మోదీని ఇంటర్వ్యూ చేయడానికి పాడ్కాస్టర్ ఫ్రిడ్మాన్ గత నెలలో భారతదేశానికి వచ్చారు. తన పర్యటనకు ముందు, భారత చరిత్రతో సహా వివిధ అంశాలపై ప్రధానమంత్రి మోదీతో గంటల తరబడి సంభాషించడం పట్ల ఫ్రిడ్మాన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
లెక్స్ ఫ్రిడ్మాన్ 2018 నుంచి పాడ్కాస్టింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖ వ్యక్తులతో పాడ్కాస్ట్లు చేశారు. ఫ్రిడ్మాన్ కూడా ఒక అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త. అతను తన పాడ్కాస్ట్లో ఇంటర్వ్యూ చేసిన ప్రముఖ వ్యక్తులలో స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఉన్నారు. ఫ్రిడ్మాన్ తన యూట్యూబ్ ఛానెల్లో 4.5 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లను కలిగి ఉన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.