నిలదొక్కుకున్నాం… టీడీపీిని నిలబెట్టాం

Written by RAJU

Published on:

నిలదొక్కుకున్నాం… టీడీపీిని నిలబెట్టాం– మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను
– ‘జనసేన జయకేతనం’ ఆవిర్భావ సభలో పవన్‌ కల్యాణ్‌
కాకినాడ : ఓడినా అడుగులు ముందుకు వేశామని, అధికారం కోసం కాకుండా మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడలో శుక్రవారం జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సభలో ఆయన మాట్లాడారు. అన్నీ ఒక్కడినే అయి 2014లో జనసేన పార్టీని స్థాపించానన్నారు. 2018 పోరాట యాత్ర చేశానని తెలిపారు. ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశామన్నారు. ఓడినా అడుగు ముందుకే వేశామని, మనం నిలదొక్కుకోవడమే కాకుండా నాలుగు దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టామని అన్నారు. 2019లో ఓడినప్పుడు ఎన్నో అవమానాలను చూశామని పేర్కొన్నారు. వీర మహిళలను సైతం హింసించారన్నారు. ఇదేం న్యాయమని అడిగితే కేసులు పెట్టారని వివరించారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో బంధించారని విమర్శించారు. అసెంబ్లీ గేటును కూడా తాకలేవు అని ఛాలెంజ్‌ చేసిన వారి తొడలను బద్దలుగొట్టామన్నారు. దేశమంతా చూసేలా వంద శాతం స్ట్రైక్‌ రేట్‌తో విజయం సాధించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టామని తెలిపారు. వంద శాతం స్ట్రెక్‌ రేట్‌కు జనసేన సిద్ధాంతాలే కారణమన్నారు. హర్యానాలో ఎన్డీఏ కోసం ప్రచారం చేశానని, 95 శాతం సీట్లు గెలిచామని తెలిపారు. దేశంలో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వచ్చిన జనసైనికులకు అభిమానులకు వారివారి ప్రాంతీయ భాషలో నమస్కారాలు తెలిపారు. బహుభాషా విధానమే దేశానికి మంచిదన్నారు. తాను సినిమాలను దృష్టిలో పెట్టుకుని ఎదగలేదని, సమాజాన్ని దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎదిగానని తెలిపారు.
2006లో బహుజన సిద్ధాంతాల కోసం అంబేద్కర్‌ ఆశయాల కోసం ఆలోచించే ప్రస్తుత హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ శ్రీపతిరాముడు రాజకీయాల్లోకి రావాలని కోరారని, తనకు ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదని ఆనాడు తెలిపానన్నారు. 450 మంది జనసైనికులు సినిమాలను కాకుండా పార్టీ సిద్ధాంతాలను నమ్మి వివిధ కారణాలతో చనిపోయారని, వారందరి కుటుంబాలను పార్టీ తరఫున ఆదుకున్నామని తెలిపారు. గద్దర్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. సగటు మధ్యతరగతి మనిషిగా బతకాలన్నదే తన కోరికని తెలిపారు. రాజకీయాల్లోకి వస్తాననిగానీ, సినిమాల్లోకి వస్తానని తానూ కూడా ఊహించలేదన్నారు. ప్రజా సమస్యలపై నిలబడేలా చేసింది తనలో భావ తీవ్రత అని తెలిపారు. చేగువేరాలో మానవత్వాన్ని చూసి ఇష్టపడ్డానన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడగలగడం తన ఆదర్శమని తెలిపారు. చిన్నతనం నుంచి ఈ క్షణం వరకు ప్రతి అంశాన్ని నేర్చుకుంటూనే ఉన్నానన్నారు. మనం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని, వారిని 11 సీట్లకు పరిమితం చేశామని పేర్కొన్నారు. ఈ సభ వేదిక కోసం కష్టపడిన పారిశుధ్య సిబ్బందికి ముందుగా ధన్యవాదాలు తెలిపారు .నాయకులు, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, ఆవిర్భావ దినోత్సవాన్ని ముందుండి నడిపిన మంత్రి నాదెండ్ల మనోహర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌, 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు జనసేన ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.
అడక్కుండానే వరాలిచ్చే వాడు పవన్‌ : నాగబాబు
దేవుడు అడిగితేనే వరాలు ఇస్తాడని, పవన్‌ కల్యాణ్‌ అడగకుండానే వరాలిస్తాడని ఆయన సోదరుడు కె.నాగబాబు అన్నారు. తనకు ఎంఎల్‌సీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నోటి దురుసున్న నేతకు ప్రతిపక్ష హోదా కూడా దొరకలేదన్నారు. తర్వాత అధికారం మాదే అంటూ జగన్‌ కలలు కంటున్నారని విమర్శించారు. మరో 20 ఏళ్లు జగన్‌ కలలు కంటూనే ఉండాలని సలహా ఇచ్చారు.
రాష్ట్రానికే కాదు… దేశానికీ ఉపయోగపడేలా పవన్‌ ఎదగాలి : నాదెండ్ల మనోహర్‌
రాష్ట్రానికే కాదు… దేశానికీ ఉపయోగపడేలా పవన్‌ ఎదగాలని జనసేన పార్టీ పిఎసి చైర్మన్‌, మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆకాక్షించారు. ఎన్ని అవమానాలు ఎదురైన జనసేన ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడిందన్నారు. జనసేన ఎప్పుడూ సామాన్యుల పక్షానే ఉంటుందని తెలిపారు. ప్రశ్నించే స్థాయి నుంచి పరిష్కరించే స్థాయికి మనం ఎదిగామన్నారు. అధికారులతో కలిసి ప్రభుత్వ పథకాలు అమలయ్యేలా జనసైనికులు చూడాలని కోరారు.
సభాప్రాంగణం వద్ద తోపులాట
ఆవిర్భావోత్సవ సభలో తోపులాట చోటుచేసుకుంది. వీరమహిళలు ఉన్న ప్రాంగణంలోకి కార్యకర్తలు దూసుకురావడంతో ఒక మహిళా కానిస్టేబుల్‌, మరో ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు.
బైక్‌లపై విన్యాసాలు
జనసేన ఆవిర్భావ జయకేతనం సభకు వచ్చిన యువకులు బైకులపై విన్యాసాలు చేస్తూ కేరింతలు కొట్టారు. జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో తిరుగుతూ హల్‌చల్‌ చేశారు. ఒకే బైకుపై ముగ్గురు, నలుగురు యువకులు ఎక్కి విన్యాసాలు చేశారు.
ప్రయాణికునిపై దాడి
216వ నెంబర్‌ జాతీయ రహదారికి ఒక పక్కనే వాహనాలను పార్కింగ్‌ చేశారు. దీంతో, ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఒక ద్విచక్ర వాహన చోదకునిపై జనసేన కార్యకర్త కర్రతో దాడి చేశాడు. అడ్డుగా ఉన్న వాహనాన్ని తీయాలని కోరినందుకు ఆగ్రహంతో దాడికి తెగబడ్డారు. తోటివారు కలుగజేసుకుని అడ్డుకున్నారు.
పోలీసులతో వాగ్వాదం
సభకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా జనం తరలి వచ్చారు. పోలీసులు పాసులు తనిఖీ చేసి లోపలికి పంపే ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి భారీగా చేరుకున్న జనసైనికులు ఒక్కసారిగా సభ ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో జనసైనికులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Subscribe for notification