Telangana Group 1 Mains Results 2025 : తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ఇప్పటికే ముగిశాయి. ఫలితాల కోసం అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా..

ఎట్టకేలకు ఫలితాలు విడుదల
2022 ఏప్రిల్ నెలలో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అదే ఏడాది అక్టోబర్లో ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించింది. అనంతరం 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇంతలో గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రశ్నపత్రం లీక్ అయినట్లు నిర్ధారణ కావడంతో.. ఆ ఎగ్జామ్ను రద్దు చేసింది. ఆ తర్వాత 2023 జూన్ 11న రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా.. నిర్వహణ ప్రక్రియలో లోపాలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.
ఈ వివాదంపై వాదనలు విన్న ధర్మాసనం.. పరీక్షను రద్దు చేయాలని ఆదేశించింది. దీంతో ఆ పరీక్ష కూడా రద్దయ్యింది. ఆ తరవాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 60 పోస్టులను కొత్తగా కలిపి మొత్తం 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత ప్రిలిమ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించడం వేగంగా జరిగిపోయింది. తాజాగా ఫలితాలను ప్రకటించింది. ఈ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్కు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక మంగళవారం (మార్చి 11) నాడు గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేయనున్నారు. అలాగే.. మార్చి 20వ తేదీలోపు అన్ని పోటీ పరీక్షల ఫలితాలు విడుదల చేసే విధంగా కమిషన్ ప్రణాళిక రూపొందించింది.
టీజీపీఎస్సీ ఫలితాల విడుదల షెడ్యూల్
మార్చి 10 – గ్రూప్ 1 ఫలితాల విడుదల
మార్చి 11 – గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల
మార్చి 14 – గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల
మార్చి 17 – హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (HWO) తుది ఫలితాల ప్రకటన
మార్చి 19 – ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తుది ఫలితాల విడుదల