ABN
, Publish Date – Apr 25 , 2025 | 12:15 AM
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దొంగ అని ఏ2 నిందితుడు విజయసాయి రెడ్డే చెబుతున్నారని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

సాలూరు/పాచిపెంట, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దొంగ అని ఏ2 నిందితుడు విజయసాయి రెడ్డే చెబుతున్నారని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పాచిపెంట మండలంలోని మిర్తివలస, కొత్తవలస గ్రామాల్లో ఆమె గురువారం పర్యటించారు. అనంతరం సమీపంలో ఉన్న పామాయిల్ తోటలో మండలానికి చెందిన టీడీపీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తప్పులు చేసినవారు విజయవాడ, హైదారాబాద్ ఆసుపత్రుల్లో చేరి వైద్యం చేయించుకుంటున్నారని… కొంతమంది రాష్ట్రం విడిచి వెళ్లి పోయారని ఎద్దేవా చేశారు. ఎన్నో తప్పులు చేసిన ఐపీఎస్ అధికారి సీతారామంజనేయులును న్యాయస్థానం విడిచిపెట్టడం లేదని అన్నారు. రోజాతో పాటు వైసీపీ నాయకులు ‘ఆడుదాం ఆంధ్ర’లో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. జీవో నెం.3ను చంపేసింది వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముఖీ సూర్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి యుగంధర్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ పిన్నింటి ఈశ్వరరావు, మాదిరెడ్డి తులసిరామ్, తొత్తల సత్యవతి, కొరిపిల్లి సురేష్, ఎంపీటీసీ ఉమా తదితరులు పాల్గొన్నారు.
Updated Date – Apr 25 , 2025 | 12:15 AM