”నవ్వించడం అనేది చాలా గొప్ప వరం. మనకు ఎన్నో బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ఒక మనిషి వచ్చి మనల్ని నవ్వించ గలిగితే ఈ కష్టాల నుంచి బయటకు వెళ్ళిపోదాం కదా అనే ఆలోచన మన అందరికీ ఉంటుంది. అలా నవ్వించగలిగిన మనిషి చాలా అరుదుగా దొరుకుతారు. అలాంటి అరుదైన దర్శకుడు కళ్యాణ్ శంకర్ మనకు దొరికాడు. ‘మ్యాడ్ 2’తో ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న కళ్యాణ్కి కంగ్రాచ్యులేషన్స్. ఒక చిత్రాన్ని హిట్ చేసిన తర్వాత సీక్వెల్గా అంతకంటే గొప్పగా ప్రేక్షకులను రంజింపజేయడం చాలా కష్టం. కానీ కళ్యాణ్ అది సాధించగలిగాడు’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్గా రూపొందిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ సమర్పకులు. ఈ సినిమా ఇటీవల విడుదలై భారీ వసూళ్లతో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శిల్పకళా వేదికలో విజయోత్సవ వేడుకను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు హీరో ఎన్టీఆర్, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ, ”అత్తారింటికి దారేది’లో ఒక డైలాగ్ ఉంటుంది. మీ వెనకాల కనబడని ఒక శక్తి ఉంది అని, వీళ్ళందరి వెనుక ఆ కనబడని శక్తే మా నాగవంశీ. సినిమా అంటే చాలా ప్యాషన్ తనకి. మాట కఠినంగా ఉంటుంది కానీ, మనసు చాలా మంచిది. ఆ మంచితనమే తనని కాపాడుతుంది. వంశీతో త్వరలో ఒక సినిమా చేయబోతున్నాను. మా చినబాబు చిన్నితల్లి హారిక నిర్మాతగా మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ఘనంగా ‘మ్యాడ్ స్క్వేర్’ విజయోత్సవ వేడుక

Written by RAJU
Published on: