‘సినిమా విడుదలైన నాలుగైదు రోజుల్లోనే మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ లాభాల బాట పట్టడం సంతోషంగా ఉంది. డిస్ట్రిబ్యూటర్లను దష్టిలో ఉంచుకుని, మొదటి వారాంతం కొన్ని చోట్ల టికెట్ ధరలను పెంచాం. మొదటి వారాంతం వచ్చిన వసూళ్లతో అందరూ హ్యాపీగా ఉన్నాం. అందుకే సోమవారం నుంచి అన్ని చోట్లా సాధారణ టికెట్ ధరలతోనే సినిమాని అందుబాటులోకి తీసుకొస్తున్నాం. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి కాబట్టి, కుటుంబ ప్రేక్షకులు మరింత మంది మా సినిమాని చూడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని సమర్పకులు సూర్యదేవర నాగవంశీ అన్నారు. ‘లక్కీ భాస్కర్’, ‘డాకు మహారాజ్’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చిన హ్యాట్రిక్ సినిమా ‘మ్యాడ్ స్క్వేర్’. బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్గా రూపొందిన ఈ ‘మ్యాడ్ స్క్వేర్’లో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ సమర్పకులు. ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి, భారీ వసూళ్లు సాధిస్తూ అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది.
ఈ నేపథ్యంలో సమర్పకులు సూర్యదేవర నాగవంశీ మీడియాతో మాట్లాడుతూ, ‘సీక్వెల్ హైప్తో ఆడటానికి ఇది పెద్ద హీరో సినిమా కాదు, భారీ బడ్జెట్ సినిమా కాదు. అయినా ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. దానికి కారణం వినోదం. మేము స్వయంగా థియేటర్లకు వెళ్లి చూశాము. నాలుగు రోజుల్లోనే దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయింది. అంతే కాదు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది ప్రేక్షకుల విజయం. రివ్యూ అనేది ఒకరి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. నచ్చితే నచ్చిందని రాస్తారు, లేదంటే నచ్చలేదని రాస్తారు. అందులో తప్పు లేదు. అలా నిజాయితీగా ఇచ్చే రివ్యూలను మేము స్వాగతిస్తాము. కానీ, కొందరు సినిమాని చంపేయాలనే ఉద్దేశంతో.. రివ్యూ రాసి ఊరుకోకుండా, అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అది తప్పు. సినిమా బతికితేనే, అందరం బాగుంటాం అనే విషయాన్ని గ్రహించాలి’ అని తెలిపారు.

ఇది ప్రేక్షకుల విజయం

Written by RAJU
Published on: