మీ ఇంట్లో బంగారం ఉందా? మీ ఒంటి మీద నగానట్రా ఉన్నాయి. అయితే భద్రం బీకేర్ఫుల్. గోల్డ్ రేట్ ఎలా పెరిగిపోతోందో…దానికంటే వేగంగా క్రైమ్ రేట్ దూసుకుపోతోంది. బంగారం కంటపడితే దొంగలు పండుగ చేసుకుంటున్నారు. బాబోయ్ బంగారం దొంగలు అంటూ బాధితులు లబోదిబోమంటున్నారు. రోడ్డు మీదకెళితే చైన్ స్నాచింగులు. ఇంట్లో పెట్టి వెళితే బంగారం గాయబ్.. అనేలా మారింది పరిస్థితి.. ఇంట్లో ఉన్నా, ఒంటిపై ఉన్నా గోల్డ్ సేఫ్గా ఉండట్లేదు. గోల్డ్ రేట్లు రాకెట్ కంటే స్పీడుగా పెరుగుతున్నాయి. ఓ తులం బంగారం కొట్టేస్తే లక్ష రూపాయలు వచ్చినట్లే. దీంతో అన్ని రకాలు దొంగలు…ఇప్పుడు గోల్డ్ని టార్గెట్ చేశారు. వరుస గోల్డ్ చోరీలతో రెండు తెలుగు రాష్ట్రాలను బెంబేలెత్తిస్తున్నారు.
270 గ్రాముల గోల్డ్ బ్యాగ్ మాయం
హైదరాబాద్ రాజేంద్రనగర్కి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి దుర్గారావు కుటుంబ సభ్యులతో అమలాపురంలో బంధువుల పెళ్లికి వెళ్తూ మధ్యలో విజయవాడలో దుర్గమ్మ దర్శనానికి ఆగారు. కొండపై కారును పార్క్ చేసి దర్శనానికి వెళ్లారు. తర్వాత తిరిగొచ్చి చూస్తే కారులో 270 గ్రాముల బంగారమున్న బ్యాగ్ మాయమైపోయింది. దాని విలువ రూ. 20 లక్షలపైన ఉంటుందని బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదుచేసింది
నర్సీపట్నంలో 9.5 తులాల బంగారం చోరి.. ప్రొద్దుటూరులో 60 తులాలు మాయం
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మూడు ఇళ్లలోకి చొరబడి తొమ్మిదిన్నర తులాల బంగారం, 42 తులాల వెండి, నగదు అపహరించారు దొంగలు. ఇక కడప జిల్లా ప్రొద్దుటూరు బొల్లవరం వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో, తాళాలు వేసిన 4 ఇళ్లలో దొంగలు పడి 60 తులాల బంగారం దోచుకున్నారు. దొంగతనం జరిగిన ఇళ్లలో టూ టౌన్ ఎస్ఐ ధనుంజయ నివాసం కూడా ఉంది.
రాజానగరంలో చైన్ స్నాచింగ్
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు దగ్గర చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. నీలంతోటకు చెందిన మహిళ స్థానిక రైస్ మిల్లు వీధిలో వెళుతుండగా, ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కెళ్లారు కేటుగాళ్లు.
ఆలయంలో 9 కాసుల గోల్డ్ చోరి
నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని కొమురం భీం చౌరస్తాలో ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో దొంగలు పడ్డారు. హుండీని పగులగొట్టి బంగారు పుస్తెలతో సహా 9 కాసుల బంగారం,10 గ్రాముల వెండిని ఎత్తుకెళ్లారు.
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రం తిమ్మానగర్లోని నగల దుకాణంలో చోరీ జరిగింది. రాత్రి దుకాణం మూసివేసిన యజమానులు, ఉదయం తలుపులు తీసి చూసేసరికి షాపు గుల్ల చేశారు దొంగలు. దుకాణంలోని బంగారపు నగలను ఊడ్చేశారు.
గోల్డ్ రేటు పెరగడంతో క్రైమ్ రేటు కూడా రాకెట్ స్పీడుతో పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా గోల్డ్కి గురి పెట్టారు చోరులు. ఒక్క చైన్ కొట్టేస్తే లక్షలు వస్తాయి. ఒక ఇంటికి కన్నం వేసి పసిడి పట్టేస్తే, లక్షలు జేబులు వేసుకోచ్చు. దీంతో దొంగల కళ్లన్నీ ఇప్పుడు బంగారం మీదే పడ్డాయి. సో ఇంట్లో అయినా, వీధిలో అయినా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని.. పోలీసులు సూచిస్తున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం.. ఇంకా అనుమానం ఉంటే.. పోలీసులను సంప్రదించడం మంచిది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..