అందరిచూపు టీవీ9 నెట్‌వర్క్ పైనే.. WITT 2025 కార్యక్రమానికి ప్రధాని మోదీ, పలువురు ముఖ్యమంత్రులు..

Written by RAJU

Published on:

భారతదేశంలోని అతిపెద్ద వార్తా నెట్‌వర్క్ TV9 వార్షిక కార్యక్రమం ‘వాట్ ఇండియా థింక్స్ టుడే (WITT) 2025’ మూడో ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రసిద్ధ భారత్ మండపంలో రెండు రోజులపాటు వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమం జరగనుంది.. మార్చి 28, 29 తేదీల్లో జరిగే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖ వ్యక్తులు, రాజకీయ నేతలు, వ్యాపార వేత్తలు పాల్గొననున్నారు. వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి చెందిన భారతదేశం కోసం రోడ్‌మ్యాప్‌ అనే అంశంపై కీలక ప్రసంగం చేయనున్నారు. అంతేకాకుండా.. TV9 నెట్‌వర్క్ ఈ వార్షిక కార్యక్రమంలో 11 మంది కేంద్ర మంత్రులు, ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారు.

టీవీ9 ప్రతి ఏటా నిర్వహించే వార్షిక ఫ్లాగ్‌షిప్ వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ప్రత్యేక అతిథిగా హాజరు కానుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.. గతేడాది ప్రధాని మోదీ భారత అభివృద్ధితోపాటు.. పలు అంశాలను ప్రస్తావించారు. అంతేకాకుండా.. మెగా ప్లాట్‌ఫామ్‌లో పాల్గొని టీవీ9 రిపోర్టింగ్ బృందాన్ని సైతం ప్రశంసించారు.

మార్చి 28 – 29 తేదీలలో ఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత్ మండపంలో నిర్వహించే వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో.. భారత అభివృద్ధి, రాజకీయాలతోపాటు అనేక అంశాలపై చర్చ జరగనుంది. అంతేకాకుండా వినోదం, వ్యాపారం, ఆరోగ్యం, సంస్కృతి, క్రీడలు వంటి అనేక ముఖ్యమైన అంశాలపై లోతైన చర్చలు జరుగుతాయి. ప్రధాని మోదీతో పాటు, అనేక మంది కేంద్ర మంత్రులు, 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ మెగా వేదికలో పాల్గొని వారి అభిప్రాయాలను పంచుకోనున్నారు.

2024 టీవీ9 మెగా ఈవెంట్‌లో ప్రధాని మోదీ..

WITT ఈ మెగా ప్లాట్‌ఫామ్‌లో దేశ పురోగతి.. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం అనే కల.. ప్రపంచ స్థాయిలో భారతదేశం పాత్ర వంటి అనేక అంశాలపై ప్రధాని మోదీ తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు.. గత సంవత్సరం టీవీ9 నెట్‌వర్క్ నిర్వహించిన రెండు అతిపెద్ద కార్యక్రమాలకు ప్రధాని మోదీ హాజరయ్యారు.

టీవీ9 నెట్‌వర్క్ వార్షిక సదస్సు అయిన వాట్ ఇండియా థింక్స్ టుడే 2024 ఎడిషన్‌కు కూడా ప్రధాని మోదీ హాజరయ్యారు. గత సంవత్సరం ఫిబ్రవరి 25 – 26 తేదీలలో ది అశోక్ హోటల్‌లో జరిగిన “వాట్ ఇండియా థింక్స్ టుడే” అనే అంశంపై జరిగిన న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ 2024లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. దీని తరువాత, ప్రధాని మోదీ 2024 నవంబర్‌లో జర్మనీలో జరిగిన న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌లో కూడా పాల్గొన్నారు.

TV9 బృందాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ..

ఈ గొప్ప ఆలోచనల వేదిక 2024 ఎడిషన్‌లో ప్రధాని మోదీ TV9ని ప్రశంసించారు. “టీవీ9 రిపోర్టింగ్ బృందం దేశ వైవిధ్యాన్ని సూచిస్తుంది. వారి బహుభాషా వార్తా వేదికలు టీవీ9ని భారతదేశ శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి ప్రతినిధిగా నిలిపాయి” అని ఆయన అన్నారు. తన ప్రసంగంలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించారు ప్రధాని మోదీ.. “మా ప్రభుత్వం అన్నింటికంటే ముందు దేశం అనే సూత్రాన్ని నిరంతరం ముందుకు సాగుతోంది” అని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు, రామాలయ నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు, వన్ నేషన్.. వన్ పెన్షన్, నారీ శక్తి వందన చట్టం, రక్షణ సిబ్బంది చీఫ్ పదవి ఏర్పాటు గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు.

ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్, అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా భారతదేశం, విదేశాల నుండి అనేక మంది ప్రభావవంతమైన వ్యక్తులు ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ న్యూస్ 9 గ్లోబల్ సమ్మిట్ 2024 లో పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification
Verified by MonsterInsights